అందోల్, ఏప్రిల్ 15: లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు మంగళవారం గులాబీ దళపతి, అపర భగీరథుడు కేసీఆర్ అందోల్ గడ్డపై కాలుపెట్టనున్నారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సెంటర్ పాయింట్గా చౌటకూర్ మండలం తాడ్దన్పల్లి చౌరస్తా వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా అందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మాజీ మంత్రి హరీశ్రావు, జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించగా, మంగళవారం చింతా ప్రభాకర్, చంటి క్రాంతికిరణ్, టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి తదితరులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్ పార్లమెంట్ పరిధి నుంచి పటాన్చెరువు, సంగారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిరానున్నారు. బహిరంగ సభకు ఆరు నియోజకవర్గాల నుంచి లక్ష పైచిలుకు ప్రజలు, పార్టీ శ్రేణులు రానుండగా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తాగునీటి వసతితో పాటు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జోగిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు బహిరంగ సభ వెనకాల ఉన్న ఫంక్షన్ హాల్ పక్కన, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలకు తడ్దాన్పల్లి గ్రామంలోకి వెళ్లే రోడ్డు దగ్గర పార్కింగ్ కోసం స్థలాన్ని సిద్ధం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా తమకు కేటాయించిన స్థలంలోనే వాహనాలు పార్కింగ్ చేసి ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు.
కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరువు, నర్సాపూర్, నారాయణఖేడ్ నియోజక వర్గాల నుంచి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు. సోమవారం తాడ్దన్పల్లి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు నియోజకవర్గాల నుంచి లక్ష మంది తరలివస్తారని చెప్పారు. అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. పార్టీ నాయకులు గ్రామాల నుంచి కార్యకర్తలను తీసుకొచ్చి మళ్లీ ఇంటికీ చేరేవరకు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సాయంత్రం 4 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ సభా స్థలికి చేరుకుంటారని, ఆలోగా పార్టీ శ్రేణులు మీటింగ్ దగ్గరకు రావాలన్నారు. కార్యక్రమంలో చౌటకూర్ అధ్యక్షుడు శివకుమార్, నాయకులు వీరభద్రరావు, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.