మెదక్ (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి, జనవరి 27: అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అన్ని శిబిరాలకు ప్రజలు తరలివచ్చి, నేత్ర పరీక్షలు చేయించుకుంటున్నారు. మెదక్ జిల్లాలో 40, సంగారెడ్డి జిల్లాల్లో 69 వైద్య బృందాలతో కంటి పరీక్షలు చేయిస్తున్నారు. ఈ పరీక్షల్లో అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేస్తూ, ఆపరేషన్ల కోసం రెఫర్ చేస్తున్నారు. మసకబారిన కండ్లతో ఇబ్బందులు పడ్డ వారు కంటి వైద్యం తర్వాత అద్దాలు పెట్టుకుని, ఇంతమంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లావ్యాప్తంగా 40 బృందాలు కంటి పరీక్షల్లో పాల్గొనగా, ఇప్పటి వరకు 28,730 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 13,185 మంది పురుషులు, 14,915 మంది మహిళలున్నారు. 4965 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, 4643 మందికి కంటి అద్దాల కోసం రెఫర్ చేశారు. ఆరో రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 4558 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2259 మంది పురుషులు కాగా, 2299 మంది మహిళలున్నారు. 646 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. 485 మందికి కంటి అద్దాల కోసం రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 28వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించామని అన్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో శుక్రవారం 21,302 మందికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. 69 వైద్యబృందాలు 22,700ల పరీక్షలు చేసేందుకు లక్ష్యం పెట్టుకోగా, శిబిరాలకు వచ్చిన 21302 మందికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, 3456 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 1924 మందిని ప్రత్యేక ఆఫరేషన్లకు రెఫర్ చేశారు.