సిద్దిపేట టౌన్, జనవరి 18 : సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని సీపీ శ్వేత అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ పీజీ కళాశాలలో బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ క్రైం రిపోర్టింగ్ అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రజలకు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తే జర్నలిజంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా వార్తలు రాయాలన్నారు. రాసే వార్తల్లో స్పష్టత ఉండాలని, ఊహించుకుని వార్తలు రాయొద్దని సూచించారు. జర్నలిస్టులు వార్తను ప్రచురించిప్పుడు దాని పర్యవసనాలను సైతం ఆలోచించాలని, ఇది సమాజాన్ని చైతన్య పరిచే జర్నలిస్టులకు ఉండాల్సిన ముఖ్య లక్షణమన్నారు.
నేరం జరిగినప్పుడు ఊహించుకుని రాయొద్దని సూచించారు. జర్నలిస్టులు, పోలీసుల రిలేషన్ ఎలా ఉండాలో, నేరాలు జరిగినప్పుడు పోలీసులకు ఎలా సహకరించాలో విద్యార్థులకు వివరించారు. ముఖ్యమైన వార్త రాసే సమయంలో సంబంధింత అధికారుల వివరణ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మనం రాసే ప్రతి వార్తను లక్షలాది మంది చదువుతారని, వార్తలో అన్ని కోణాలను ఆవిష్కరించాలని సూచిం చారు. జర్నలిజం పూర్తి చేసుకుని సమాజం ముందుకు వస్తున్న విద్యార్థులను సీపీ అభినందించారు. కార్యక్రమంలో కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ రవినాథ్నాయక్, అధ్యాపకులు రమేశ్, శ్రీహరి, ఛత్రపతి యాదవ్, జర్నలిజం చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.