ఝరాసంగం : దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఝరాసంగం ( Jharasangam ) కేతకీ సంగమేశ్వర క్షేత్రం (Ketaki Sangameshwara Temple ) భక్తులతో కిటకిటలాడుతుంది. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అష్టతీర్థాల నిలయమైన అమృత గుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ఆ త్రిలోకనాథుని దర్శనం చేసుకున్నారు. కేతకీ వనమంతా ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరి మంత్రంతో భక్తపారవశ్యంతో స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు బారులు తీరి, ఆ పరమశివుని కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు.

తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలివచ్చారు. జహీరాబాద్, బీదర్, నారాయణఖేడ్ ప్రాంతాల నుంచి శివభక్తులు పాదయాత్రగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో దేవుజా, డీఎస్పీ సైదా నాయక్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షిస్తుండగా, దేవస్థానం చైర్మన్ చంద్రశేఖర్, ఈవో శివరుప్ప, సర్పంచ్ వినోద బాలరాజ్ తదితరులు భక్తులకు అసౌకర్యం కలుగకుండా పర్యవేక్షిస్తున్నారు.