చేర్యాల, ఆగస్టు 4: జనగామ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని సర్కారు దవాఖానతో పాటు పీహెచ్సీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు మంగళవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఆయన వినతిపత్రం అందజేశారు.
మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని డా బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల వైద్య, ఆరోగ్యశాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొని జనగామ నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. చేర్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్తో పాటు కొమురవెల్లి, ముస్త్యాల, మద్దూరు, లద్నూరు పీహెచ్సీల్లో ప్రస్తుతం ఉన్న వసతులతో పాటు అవసరమైన అదనపు వసతులు కల్పించాలని, వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరారు.
వైద్య పరికరాల కొరత, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రితో చర్చించారు.జనగామ నియోజకవర్గంలోని దవాఖానల్లో వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మంత్రికి విజ్ఞప్తి చేయడంతో పాటు అవసరమైన ప్రతి అంశాన్ని సర్కారు దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. సిబ్బంది నియామకంతో పాటు మౌలిక వసతుల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.