జనగామ, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధి.. ఆహ్లాదం.. సుందరీకరణలో సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తరహాలో జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే జిల్లా కేంద్రం రూపురేఖలు మారుస్తానని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ మున్సిపల్ పరిధిలోని 20, 21, 22, 28, 29, 30 వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఆయా వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు జూకంటి లక్ష్మి, కర్రె శ్రీనివాస్, మహ్మద్ సమద్, ముస్త్యాల దయాకర్, బొట్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పల్లాకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు ఇండ్ల ముందు జై బీఆర్ఎస్.. జైజై కేసీఆర్.. జై పల్లా అంటూ ముగ్గులు వేసి మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాడవాడలా కలియతిరిగిన పల్లాకు బోనాలు, డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు దగ్గరగా ఉండే తనకు జనగామ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే అందరివాడిగా పనిచేస్తానని, జనగామకు పెద్ద పాలేరుగా ఉంటానని తెలిపారు. జనగామ పట్టణానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తన తొలి ఎజెండా అంశంగా పేర్కొన్నారు.
పెద్దసారు కేసీఆర్ నా మీద నమ్మకంతో జనగామ అభ్యర్థిగా వెళ్లమన్నప్పుడు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు వెళ్తే అందరూ ఆశీర్విదించారన్నారు. నా ముఖం తెల్వకపోయినా ప్రేమ, ఆప్యాయతతో స్వీకరిస్తున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కేసీఆర్ గులాబీ జెండా ఎత్తిన నాడు కూడా సిద్దిపేటకు ఆనుకొని ఉన్న జనగామ మీ వెంట నడిచిందని తెలిపారు. జనగామకు మెడికల్ కాలేజీ ఇచ్చారని, దానితోపాటు నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్, వెటర్నరీ కాలేజీ సాధించుకుందామన్నారు. జనగామలో నీళ్లు వస్తున్నయి కానీ, వాటిని తాగునీళ్లుగా భావించి ఎవరూ తాగడం లేదన్నారు. చీటకోడూరు రిజర్వాయర్ను బాగుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న జనగామకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రంగప్ప చెరువు అభివృద్ధి, ఆర్అండ్బీ గెస్ట్హౌజ్, డీసీపీ ఆఫీసు, స్పోర్ట్ స్టేడియం, కళాభవనం కావాలని, బచ్చన్నపేట, చేర్యాల, నర్మెటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ సాధిస్తానని తెలిపారు. జనగామ యువత కోసం ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ను స్థాపించేందుకు సీఎం కేసీఆర్ను ఒప్పిస్తానని చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు జనగామను బంగారు తునకగా మారుస్తానని హామీ ఇచ్చారు. సారు ఆశీర్వదించి పంపించారు.. ప్రజలు కారుగుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని తెలిపారు.
కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమైపోతమని.. పొరపాటున ఆ మోసగాళ్లను నమ్మితే గోస పడాల్సి వస్తుందని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రైతుబంధు సాయాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారంటే కాంగ్రెస్కు రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి ఆగం కావొద్దని, కాంగ్రెస్ సెక్యులర్ పేరుతో ముస్లిం ఓట్లు దండుకుని అభివృద్ధిని విస్మరించిందన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను కర్ణాటకలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. ఆయన పాలనపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రామ్ప్రసాద్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్రెడ్డి, మహిళా, నాయకులు బండ యాదగిరిరెడ్డి, జూకంటి శ్రీశైలం, బిజ్జాల నవీన్, మున్సిపల్ కౌన్సిలర్లు బండ పద్మ, పేర్ని స్వరూప, అనిత, మల్లవరపు అరవింద్, మల్లిగారి రాజు, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పాండు, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.