తెరపైకి జమున హెచరీస్ భూముల వ్యవహారం
దళిత, మాలమహానాడు, రజక సంఘాల ఆధ్వర్యంలో పోరుబాట
ఏడాది క్రితం వెలుగులోకి వచ్చిన వైనం
సర్వే పూర్తయినా బాధితులకు దక్కని భూములు
మెదక్ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
అందరికీ న్యాయం చేస్తాం: మెదక్ కలెక్టర్ హరీశ్
సమస్య సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే మదన్రెడ్డి
‘జమునా హెచరీస్ కంపెనీ పేరుతో మా భూములను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కబ్జాచేశాడు, మా భూములు మాగ్గావాలె’ అని దళిత, మాలమహానాడు, రజక సంఘాల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాలకు చెందిన సుమారు 150 మంది బాధిత రైతులు శుక్రవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ హరీశ్, అధికారులు ఆరు నెలల క్రితం సర్వే చేశారని, కానీ ఇప్పటి వరకు తమకు పొజిషన్ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్రెడ్డిని రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. కబ్జా చేసిన భూములను వెంటనే ఇప్పించాలని కోరగా, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు.
మెదక్, జూన్ 24 (నమస్తే తెలంగాణ)/ నర్సాపూర్: జమున హేచరీస్ భూ బాధితులు మళ్లీ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. మా భూములు మాగ్గావాలని దళిత, మాలమహానాడు, రజక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సుమారు 150మంది బాధిత రైతులు మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల శివారులో గల భూములను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బలవంతంగా కబ్జా చేశారని వారు ఆరోపించారు. మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, అధికారులు ఆరు నెలల క్రితం సర్వే చేశారని, ఇప్పటి వరకు తమకు పొజిషన్ చూపించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ భూములను తమకు అప్పగించాలని, లేదంటే ఆయా సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు.
మెదక్ జిల్లా మాసాయిపేటలో…
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో 130 సర్వేనంబర్లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురికి ప్రభుత్వం కేటాయించగా, ఆ రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ భూమిని రజక కులానికి చెందిన చాకలి భిక్షపతి, చాకలి లింగయ్య, చాకలి యాదయ్య, చాకలి నాగులు, చాకలి బుచ్చమ్మ, చాకలి కళమ్మ, చాకలి శ్రీనివాస్, చాకలి రాజమణికి ఒక్కొక్కరికి ఎకరం 20 గుంటల భూమిని ఇస్తూ పట్టా సర్టిఫికెట్లను గతంలో అధికారులు జారీచేశారు. 27 ఏండ్లుగా ఈ భూములను సాగుచేసుకుంటూ బతుకుతున్నామని రైతులు తెలిపారు. ఏడాది కింద ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్ కంపెనీ ఈ భూములను అక్రమంగా కబ్జా చేసి, చుట్టూ ప్రహరీ నిర్మించి, తమ భూముల్లోకి రానివ్వడం లేదని వాపోయారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్కు విన్నవించామన్నారు. ఈటల రాజేందర్ కబ్జాలకు పాల్పడిన భూములపై గత డిసెంబర్లో అధికారులు సర్వే చేశారని, కానీ.. ఇప్పటి వరకు ఆ భూముల పొజిషన్ చూపించలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ హరీశ్ ప్రత్యేక చొరవ తీసుకొని తమ భూములు తమకు ఇప్పించాలని కోరారు. కాగా, రైతులు కలెక్టరేట్ ముట్టడి విషయం తెలుసుకున్న మెదక్ కలెక్టర్ హరీశ్ శుక్రవారం బాధిత రైతులతో ఫోన్లో మాట్లాడారు. భూముల సర్వేను పూర్తిచేశామని, ఇప్పటికే 337 మందికి పట్టాలు ఇచ్చామని, మరో 87మందికి ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కోర్టులో 3 రిట్ పిటిషన్లు ఉండడంతో ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు చెప్పారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
సీఎం దృష్టికి సమస్య తీసుకెళ్తా : ఎమ్మెల్యే మదన్రెడ్డి
కాగా, మాసాయిపేట్ మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. జమున హేచరీస్ పేరిట ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూములను ఇప్పించాలని కోరగా, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.అంతేకాకుండా భూములు కోల్పోయిన రైతులకు వారం రోజుల్లోగా పట్టాలు అందజేస్తామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని తెలిపారు. ఒకప్పుడు ఆ భూములకు దారులు లేవని, ఇప్పడు అవి కూడా వేయించి, ఎవరి భూములు వారికి హద్దులు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు భూములను అప్పగించి వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమా వర్తించేలా చూస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీధర్గుప్తా, నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, వెల్దుర్తి టీఆర్ఎస్ మండల మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకట్, నగేశ్, మాసాయిపేట్, వెల్దుర్తి మండల ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.