పటాన్చెరు, ఫిబ్రవరి 24 : ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పటాన్చెరు పేరు మరోసారి జాతీయస్థాయిలో మెరిసింది. మనదేశం చేపడుతున్న కీలకమైన గగన్యాన్ యాత్రకు సంబంధించి కీలకమైన మెషినరీని తయారుచేసి ఇవ్వడంలో హైదరాబాద్ సమీపంలోని పారిశ్రామికవాడలు అండగా నిలుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామ పరిధిలోని మంజీరా మేషిన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గగన్యాన్ యాత్రకు కావాల్సిన సిమ్యులేటెడ్ క్రూ మాడ్యుల్ (ఎస్సీఎం) అనే పరికరాన్ని తయారుచేసింది. దీనిని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వర్చువల్గా వీడియో కాల్లో ప్రత్యక్షంగా చూస్తుండగా, వీఎస్ఎస్సీ డైరెక్టర్ ఉన్నికృష్ణన్ ఆవిష్కరించారు. గగన్యాన్ యాత్రలో భాగంగా స్పేస్కు పంపించిన వ్యక్తులను భూమిపైకి చేర్చే క్రమంలో ఎస్సీఎమ్ పరికరం ఉపయోగపడుతుంది. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మంజీరా పరిశ్రమ ఆరునెలల్లోనే దీనిని తయారుచేసి ఇస్రోకి అందజేసింది. రాకెట్పైన గోళాకారంలో ఉండే ప్రత్యేక క్యాబిన్నే క్రూ మోడ్యుల్ అని అంటారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఈ సందర్భంగా మంజీరా మెషిన్ మిల్డర్ పరిశ్రమ ఎండీ సాయిప్రకాశ్ని అభినందించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఉన్నికృష్ణన్ సైతం మంజీరా యాజమాన్యాన్ని అభినందించారు. ఈ పరిశ్రమలో పనిచేసిన ఇంజినీర్లు, కార్మికులు, సిబ్బందిని ఆయన మెచ్చుకున్నారు.
అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు రాకెట్లో కీలకమైన పరికరం సిమ్యులెటెడ్ క్రూ మాడ్యూల్ (ఎస్సీఎం) ఫ్యాబ్రికేషన్ షెల్ తమ కంపెనీలో తయారుకావడం గర్వంగా ఉందని మంజీరా మెషిన్ బిల్డర్స్ పరిశ్రమ ఎండీ సాయిప్రకాశ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎన్నో పెద్దపెద్ద సంస్థలు, కంపెనీలు ఉండగా, ఇస్రో తమ కంపెనీకి తయారీ ఆర్డర్ ఇవ్వడం చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. మానవ సహిత రాకెట్లను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో చేపట్టిన గగన్యాన్లో భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. మా సంస్థలో నిబద్ధ్దతతో పనిచేసే బృందం ఉందని అన్నారు. పెద్ద సంస్థలను కాదని ఇస్రో మా సంస్థకు కీలకమైన ఆర్డర్ ఇచ్చిందని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు. ఇస్రో చైర్మన్ అభినందించడం తమకు గర్వంగా ఉందని అన్నారు. గతంలోనూ ఇస్రో కు పలు మెషినరీలను తయారుచేసి ఇచ్చామని సాయిప్రకాశ్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గగన్యాన్ పీడీ హటన్, వీఎస్ఎస్సీ అసోసియేట్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్, హెచ్ఎస్ఎఫ్సీ డైరెక్టర్ ఉమా మహేశ్వరన్, ప్రేమ్దాస్, సంస్థ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.