ఒకప్పటి బీడు భూములు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండడంతో ప్రాజెక్టులు మండుటెండల్లోనూ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు ప్రాజెక్టును రూ.24.15 కోట్లతో ప్రభుత్వం ఆధునీకరించింది. సింగూరు జలాలను హైదరాబాద్కు తరలించటం నిలిపివేసి సంగారెడ్డి జిల్లా సాగునీటి అవసరాలకు కేటాయించింది. మంజీరా నదిపై రూ.45కోట్ల వ్యయంతో చెక్డ్యామ్లను నిర్మించింది. రూ.4,427 కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నది. మెదక్ జిల్లాలో వనదుర్గా ప్రాజెక్ట్ ఎత్తు పెంపునకు రూ.43 కోట్ల 64 లక్షలు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,94,000 ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు రూ. వేల కోట్లతో పనులు చేపట్టింది.
– సంగారెడ్డి/ మెదక్ నమస్తే తెలంగాణ, జూన్ 6
సంగారెడ్డి, జూన్ 6(నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కోసం సంగారెడ్డి రైతులు గోసపడ్డారు. జిల్లా నుంచి మంజీరా నది ప్రవహిసున్నా సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీరు పొందలేక రైతులు ఆందోళనలకు దిగారు. ఉమ్మడిరాష్ట్రంలో సాగునీటి కోసం సంగారెడ్డి జిల్లా రైతాంగం పోరాటాలు చేసినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. జిల్లాలోని ఏకైక ప్రాజెక్టుఅయిన సింగూరు నుంచి సాగునీరు ఇవ్వాలన్నా ఇవ్వకుండా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు జలాలు వాడుకున్నారు. పంటలు ఎండిపోతుండటంతో సింగూరు నుంచి జలాలు విడుదల చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు కోరినా ఉమ్మడి పాలకులు కనికరించలేదు. కండ్లఎదుటే పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరయ్యారు.
జిల్లా సాగునీటి కష్టాలను తెలిసిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ‘సింగూరు సింహగర్జన’ పేరిట సంగారెడ్డి జిల్లాలో పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహించి అప్పటి ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. రైతుల పక్షాన నిలిచి పోరాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా సాగునీటి రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చారు. జిల్లాలోని చెరువుల పూడికతీత తీయటంతోపాటు సింగూరు ప్రాజెక్టు కాల్వలు నిర్మించారు. సింగూరు జలాలను హైదరాబాద్కు తరలించటం నిలిపివేసి సంగారెడ్డి జిల్లా సాగునీటి అవసరాలకు కేటాయించారు.
నల్లవాగు ప్రాజెక్టు కాల్వలు నిర్మించి సాగునీరు అందజేశారు. దీంతో సంగారెడ్డి జిల్లాలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి జలాలను తరలించాలని సంకల్పించారు. మల్లన్నసాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తీసుకువస్తున్నారు. అక్కడి నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరి 21న నారాయణఖేడ్లో సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాల్లో నీటిపారుదల వేడుకలను పురస్కరించుకుని బుధవారం మంత్రి హరీశ్రావు మునిపల్లి మండలం చిన్ని చెల్మడ గ్రామంలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించనున్నారు.
నీటిపారుదల శాఖ పునర్వ్యవస్తీకరణ.. భారీగా నిధులు కేటాయింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. సాగునీటి పారుదల శాఖను పునర్వ్యవస్తీకరించడంతోపాటు పెద్దఎత్తున నిధులు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2021లో నీటిపారుదల శాఖను పునర్వ్యవస్తీకరించారు. ఇందులోభాగంగా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఒక సర్కిల్, నాలుగు డివిజన్లు, 21 సబ్ డివిజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో సిబ్బంది పెరగటంతోపాటు నీటిపారుదలశాఖ పనులు, నిర్వహణపై పర్యవేక్షణ పెరిగింది. సీఎం కేసీఆర్ గత తొమ్మిదేండ్లలో సంగారెడ్డి జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు రూ.261 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే మంజీరా, నల్లవాగు ప్రాజెక్టుపై చెక్డ్యామ్ల నిర్మాణానికి రూ.45.65కోట్ల నిధులు కేటాయించారు. నల్లవాగు ప్రాజెక్టు పనుల కోసం రూ.24.15 కోట్ల నిధులు కేటాయించారు.
సంగారెడ్డి జిల్లాలో గణనీయంగా పెరగనున్న ఆయకట్టు
ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్లక్ష్యం చేశారు. జిల్లాలోని ఏకైక సింగూరు ప్రాజెక్టు నుంచి 40వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు చెరువుల కింద కేవలం 50 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. కాగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు నుంచి 40వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అలాగే 132 చెరువులను సింగూరు జలాలతో నింపి మరో 10వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తున్నారు. దీంతో అందోలు నియోజకవర్గంలోని రైతులు సంతోషంగా ఉన్నారు. నల్లవాగు ప్రాజెక్టును రూ.24.15 కోట్లతో ప్రభుత్వం ఆధునీకరించింది. ఈ ప్రాజెక్టు నుంచి 6వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అలాగే మంజీరా నదిపై ప్రభుత్వం రూ.45కోట్ల వ్యయంతో చెక్డ్యామ్లను నిర్మించింది. దీంతో అదనంగా 7వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మంజీరానదిపై ప్రస్తుతం 15 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలతో 11వేల ఎకరాలకు ప్రభుత్వం సాగునీరు అందజేస్తున్నది. అలాగే జిల్లాలోని 2,167 చెరువుల నుంచి 1.42లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. స్వరాష్ట్రంలో పంట పొలాలకు సాగునీరు అంది పుష్కలంగా పంటలు పండుతుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్కు రైతులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
జిల్లాకు వరంగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలించనున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు 19, 19 ఏ ప్యాకేజీ పనులతో గోదావరి జలాలు తీసుకువచ్చి సింగూరు ప్రాజెక్టులో కలుపుతున్నారు. 19, 19ఏ ప్యాకేజీతో జిల్లాలో 1.32 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. సింగూరు ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రకటించారు. రూ.4,427 కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకాలతో జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ ఎత్తిపోతల పనులకు గతేడాది సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభంకాగా బుధవారం బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. రూ.2,653 కోట్ల వ్యయంతో ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు చేపడుతున్నది. ఈ పథకంతో జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గంలో 2.19 లక్షల ఎకరాలుకు సాగునీరు అందుతున్నది. రూ.1774 కోట్లతో ప్రభుత్వం బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నది. ఈ పథకంతో నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లోని 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. అలాగే ప్రభుత్వం మల్లన్నసాగర్ నుంచి కాల్వ ద్వారా సంగారెడ్డిలోని మహబూబ్సాగర్ చెరువులోకి గోదావరి జలాలను తీసుకురానున్నది. మహబూబ్సాగర్ కాల్వ ద్వారా పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గంలోని 39వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం తలపెట్టింది.