మెదక్ అర్బన్, జనవరి 18: ఎయిర్టెల్ సెల్ టవర్లలో బేస్బ్యాండ్ యూనిట్లు దొంగిలించి ఢిల్లీ, బంగ్లాదేశ్లకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వివరాల్లోకి వెళితే చేగుంట మండలం రామాంతపూర్, రాంపూర్ సెల్ టవర్ల వద్ద రూ. 25లక్షల విలువగల బేస్బ్యాండ్ యూనిట్ల దొంగతనం జరిగిందని, ఈ నెల 13న ఎయిర్టెల్ సెల్టవర్ పెట్రోలింగ్ ఉద్యోగి నాగరాజు చేగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మాసాని మహేశ్ ఎయిర్టెల్ బేస్బ్యాండ్ యూనిట్ల సప్లయర్గా విధులు నిర్వహిస్తున్నాడు. మహేశ్తో కలిసి అదే జిల్లాకు చెందిన సంతోష్రెడ్డి, రత్నాకర్రెడ్డి, రాజుగౌడ్ ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి హైదరాబాద్కు చెందిన మాసాని అనిల్, మహ్మద్ అఫ్రోజ్, కామారెడ్డికి చెందిన పాగిడిపల్లి అశోక్ బేస్బ్యాండ్ యూనిట్లను తక్కువ ధరకు ముగ్గురు కలిసి ఢిల్లీ, బంగ్లాదేశ్లలో విక్రయించేవారని తెలిపారు.
మరో నలుగురు నిందితులు హైదరాబాద్కు చెందిన మాసాని బాగులు, మాసాని శేఖర్, మహ్మద్ అబ్బు, చాంద్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, సైబరాబాద్ పరిధుల్లో సంవత్సరం నుంచి ఎయిర్టెల్ బేస్బ్యాండ్ యూనిట్లు దొంగతనం చేస్తున్నట్లు వివరించారు. నిందితులపై అన్ని జిల్లాల్లో కలిపి 26 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. బేస్బ్యాండ్ యూనిట్ల విలువ 5జీ అయితే రూ.3 నుంచి 5 లక్షలు, 4 జీ రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితుల నుంచి ముషీరాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లో రూ.6,75,000 విలువ గల సామగ్రి, చేగుంట పరిధిలో బెలెనో కారు, హుంద్యాయ్ గ్రాండ్ ఐ10, హోండా షైన్ బైక్, టయోటా ఇన్నోవా కారు, 7 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అతి తక్కువ సమయంలో కేసును ఛేదించిన తూప్రాన్ డీఎస్పీ యాదగరిరెడ్డి, రామాయంపేట సీఐ, చేగుంట, తూప్రాన్ ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.