కంది, డిసెంబర్ 5 : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం అధునాతన పదార్థాలు, కీలక ఖనిజాలపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్(ఐఐఎం) 79వ వార్షిక సాంకేతిక సమావేశంలో భాగంగా మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనున్నది. భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, యూఎస్ఎ, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా మెటీరియల్స్ సైన్స్, మెటలర్జికల్ ఇంజినీరింగ్ రంగాల్లో పెరుగుతున్న పరిశోధనా శక్తిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. కీలక ఖనిజాల ప్రాసెసింగ్పై పరిశోధనల వేగం పెంచాల్సిన అవసరం ఉందని, మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. టెక్నాలజీ పరంగా స్వయం సమృద్ధి చెందిన భారత భవిష్యత్తు వనరుల సేకరణ, ప్రయోజనం, కీలక మూలకాల జీవచక్రాన్ని అధిగమించే సామర్థ్యంపై ఆధారపడి ఉందన్నారు. సింగరేణి సీఎండీ ఎన్.బాలరామ్ మాట్లాడుతూ.. దేశంలో కీల క ఖనిజాల ఉత్పత్తిని బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. 45 సంస్థల నుంచి తయారు చేసిన ఆధునిక విశ్లేషణ పరికరాలు, తయారీ సాంకేతికతల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. వివిధ దేశాల ప్రతినిధులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.