ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు షురూ
మెదక్ జిల్లాలో 93.66, సంగారెడ్డిలో 94.52 శాతం హాజరు
నిమిషం నిబంధన అమలుతో సకాలంలో సెంటర్లకు చేరుకున్న విద్యార్థులు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు
కొవిడ్ జాగ్రత్తలు తీసుకున్న సిబ్బంది
మెదక్ మున్సిపాలిటీ, మే6: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ జిల్లావ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం 7,418 మందికి 6,948 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సత్యనారాయణ తెలిపారు. జనరల్ విభాగంలో 6,773 మందికి 6,356 మంది, ఒకేషన్లో 645 మందికి 592 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 93.66 శాతం మంది హాజరయ్యారు.
పరీక్షా కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్
జిల్లాలోని నర్సాపూర్, కొల్చారం, కౌడిపల్లి, మెదక్లోని పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్, మెదక్ ఆర్డీవో సాయిరాం సందర్శించారు. పరీక్షా కేంద్రాల్లోని మౌలిక సదుపాయల ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
సంగారెడ్డిలో మొదటి రోజు 94.52శాతం మంది హాజరు
సంగారెడ్డి కలెక్టరేట్, మే6: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా నిర్వహించారు. మొదటి రోజు ప్రథమ భాషకు 94.52 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 17,581 మందికిగాను 16,617 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో జనరల్ కేటగిరీలో 16,163 మందికి 15,332 మంది, ఒకేషనల్లో 1,418 మందికి 1,285 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.