మెదక్ మున్సిపాలిటీ, మార్చి 11: ఇంటర్మీడియట్ పరీక్షలు మరో 3 రోజుల్లో ప్రారంభంకానున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ రెండు విడతల్లో పూర్తయ్యాయి. ఈనెల 4, 6వ తేదీల్లో నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి. ఈనెల 15 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
13,616 మంది పరీక్షలు రాయనున్న విద్యార్థులు
జిల్లాలో 58 కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలు 16, ప్రైవేట్ కళాశాలు 18 ఉన్నాయి. మిగతావి కస్తుర్భా, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వేల్ఫేర్, మైనారిటీ కళాశాలలు ఉన్నాయి. 13,616 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,999 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,617 ఉన్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 15, ప్రైవేట్ పాఠశాలల్లో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. మిగతా ప్రభుత్వ సెక్టైర్లెనా మోడల్, సాంఘిక సంక్షేమ గురుకుల, గిరిజన గురుకుల పాఠశాలల్లో ఏర్పాటుచేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్తో పాటు డిపార్ట్మెంటల్ అధికారి ఉంటారు. 660 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రశ్నా పత్రాలను పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగా సీసీ కెమెరాల నిఘాలో ప్రత్యేక అధికారులు విడుదల చేయనున్నారు. ఒక ప్లయింగ్ స్కాడ్ బృందం (జూనియర్ లెక్చరర్, డి ప్యూటీ తహసీల్దార్, ఏఎస్సై), నాలుగు సిట్టింగ్ స్కాడ్ బృందాలు, 5 కస్టోడియన్ టీమ్లు ఏర్పాటుచేశారు.
హై పవర్ కమిటీ..
పరీక్షల నిమిత్తం కలెక్టర్ చైర్మన్గా హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా ఎస్పీ, ఇంటర్మీడియట్ రిజీయన్ డైరెక్టర్, జిల్లా ఇంటర్ నోడల్ అధికార సభ్యులుగా ఉంటారు.
100 శాతం సిలబస్..
జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అధ్యయన తరగతులు నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ బోర్డు 100 శాతం సిలబస్నే నిర్దేశించింది. గతేడాది కరోనా నేపథ్యంలో 70 శాతం సిలబస్తోనే ప్రశ్న పత్రాన్ని రూపొందించారు.
పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలి
పరీక్షలు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. 9 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9.30 దాటితే అనుమతించబడదు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు గాని, తల్లిదండ్రులకు గాని ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే 14416 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది
ప్రత్యేక లొకేషన్ యాప్
పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు వీలుగా ఇంటర్ బోర్డు 2018 నుంచే సెంటర్ లోకేటర్ పేరుతో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని హాల్టికెట్ నంబర్ నమోదు చేస్తే పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉంటుంది. ఏప్రాతంలో ఉంటుందనే వివరాలను సులువుగా తెలుపుతుంది.
సజావుగా పరీక్షలు నిర్వహిస్తాం..
ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాం త వాతావరణంలో నిర్వహి స్తాం. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. సమయం దాటితే అనుమతించబడదు. విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి
– సత్యనారాయణ, ఇంటర్ నోడల్ అధికారి