జహీరాబాద్, డిసెంబర్ 11: పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ భవన నిర్మాణం పూర్తయింది. త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రజలకు అవసరమైన నాణ్యమైన, తాజా కూరగాయలు, పండ్లు, మాంసం, చికెన్, పూలు ఇలా అన్నీ ఒకే చోట లభించేలా రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లతో సమీకృత కూరగాయల భవనాన్ని నిర్మించింది. అండర్ గ్రౌండ్లో కూరగాయలు, మాంసం, చికెన్, పూలు విక్రయాల కోసం 84 షాపులు, మొదటి అంతస్తులో 67 షాపులు నిర్మించారు. షాపులు ఓపెన్ టెండరు వేసి వ్యాపారులకు ఇచ్చేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పట్టణం మధ్యలో భవనం నిర్మాణం
జహీరాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం కొత్త భవన నిర్మాణం చేపట్టేందుకు రూ. 5.5 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని, వారి అభిప్రాయం మేరకు కొత్త భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. మంత్రి హరీశ్రావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు రెండు, మూడు సార్లు పట్టణంలో సైకిల్పై పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి, ఎంపీ పర్యటించిన సమయంలో మాంసం, చికెన్, కూరగాయలు రోడ్ల పక్క న షాపులు ఏర్పాటు చేసి విక్రయిండం కనిపించింది. దీంతో, వినియోగదారులకు వెజ్, నాన్వెజ్ ఒకే చోట దొరికేలా అధునాతన మార్కెట్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు సర్వే చేసి నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే రూ. 5.5కోట్లు మంజూరు చేసింది. అయితే, భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో మంత్రి హరీశ్రావు అదనంగా రూ. 4.5 కోట్లు విడుదల చేశారు. మొత్తం రూ. 10 కోట్లతో అత్యాధునిక వసతులతో భవనాన్ని పూర్తి చేశారు.
గడువులోగా పనులు పూర్తి చేస్తాం..
జహీరాబాద్ పట్టణంలో సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్ భవన నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేస్తాం. మంత్రి హరీశ్రావు, కలెక్టర్ శరత్ పలు మార్లు భవనాన్ని పరిశీలించి పలు సూచనాలు చేశారు. ఎక్కడ ఎలాంటి లోపలు లేకుండా నిర్మిస్తున్నాం. వేగవంతంగా పనులు చేస్తున్నాం. వ్యాపారులు, వినియోగదారులు వాహనాలు నిలిపేందుకు పార్కింగ్, ప్రధాన గేట్ నిర్మాణం చేశాం.
-జావిద్, కాంట్రాక్టర్, జహీరాబాద్
పనులు పూర్తి చేశాం..
పట్టణంలో రూ. 10 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత కూరగాయల భవనం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అండర్ గ్రౌండ్లో వెజ్, నాన్వెజ్ అమ్మకాలు చేసేందుకు ప్రత్యేకంగా షెడ్లు నిర్మాణం చేశాం. వ్యాపారులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు పార్కింగ్కు స్థలం కేటాయించాం. వాహనాలు నేరుగా షాపుల వద్దకు చేరేలా సౌకర్యాలు కల్పించాం. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు జారీ చేసినా వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం.
-కే. దీప్చంద్, మున్సిపల్ డీఈఈ,జహీరాబాద్
సమీకృత కూరగాయల భవనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు
జహీరాబాద్ పట్టణంలో నిర్మాణం చేసిన సమీకృత కూరగాయల భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేసి, ఈ నెల చివరి వరకు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులు పనుల్లో వేగం పెంచారు. కొత్తగా నిర్మించిన సమీకృత కూరగాయల భవనంతో పట్టణ ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. అన్ని ఒకే చోట లభించడంతో వినియోగదారులకు మేలు జరుగుతుంది.
ప్రజలు, వ్యాపారులకు మేలు
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ఎక్కడా కూరగాయలు. మాంసం, చికెన్, పూలు విక్రయించేందుకు ప్రత్యేకంగా మార్కెట్ లేదు. వ్యాపారులు రోడ్ల పక్కన చిన్న డబ్బాలు ఏర్పాటు చేసుకొని అమ్మకాలు చేస్తున్నారు. దీంతో రోడ్డు వెంట వెళ్లే ప్రజలకు ఇబ్బందులు తప్పుడం లేదు. కూరగాయలు, మాంసం అమ్మేందుకు ప్రత్యేకంగా భవనం నిర్మించడం సంతోషంగా ఉంది. అన్నీ ఒకే చోట కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.
-మోతిరాం, మాజీ కౌన్సిలర్, జహీరాబాద్