నిజాంపేట, డిసెంబర్ 21 : నేర ప్రవృతి గల వారిని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయి. పట్టణాలకే పరిమితమైన సీసీ కెమెరాలు నేడు గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. నేరాలను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీస్ సిబ్బంది వీటి ఏర్పాటుపై దృష్టిసారిస్తున్నారు. ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులకు సీసీ కెమెరాలతో కలిగే ప్రయోజనాల గురించి వివరించి ప్రధాన వీధులు, రద్దీ ప్రాంతాలు, షాప్లు, ఆలయాలు, ముఖ్య కూడళ్లలో ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా క్షణాల్లో నేరం జరిగిన ప్రదేశం, అందుకు పాల్పడిన వ్యక్తిని గుర్తించడానికి వీలవుతుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని తిప్పనగుల్లలో సర్పంచ్ చంద్రవర్ధిని,పాలకవర్గం సమక్షంలో ఎస్సై శ్రీనివాస్రెడ్డి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సమావేశం ఏర్పాటు చేసి సూచించారు. బచ్చురాజ్పల్లి గ్రామానికి చెందిన దాత గోపాల్రెడ్డి తిప్పనగుల్ల గ్రామంలో 8 సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళంగా రూ.1.50 లక్షలను అందజేశారు.వాటితో గ్రామ నలుమూలల, ప్రధాన కూడళ్ల వద్ద, ఇతర గ్రామాల నుంచి తిప్పనగుల్లకు వచ్చే ప్రతి మార్గంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని గ్రామ పంచాయతీలోని మానిటర్కు అనుసంధానం చేశారు. గ్రామంలో జరిగే దొంగతనాలు,గ్రామానికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో అన్న విషయం సీసీ కెమెరాల ఏర్పాటుతో క్షణాల్లో స్పష్టంగా తెలుస్తున్నది.
శాంతి భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. దొంగతనాలు,కిడ్నాప్ వంటి కేసుల్లో సీసీ ఫుటేజీలు సాక్ష్యాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా చైన్స్నాచింగ్, ట్రిపుల్ రైడ్, ఓవర్లోడ్, అతివేగంతో వాహనం నడపడం వంటివి సీసీ కెమెరాల్లో రికార్డ్ కాగా, వాటిని సాక్ష్యాలుగా పరిగణించి వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నాం.
తిప్పనగుల్ల గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించాలని బచ్చురాజ్పల్లికి చెందిన దాత గోపాల్రెడ్డిని అడుగగానే గ్రామంలో 8 సీసీ కెమెరాలకు ఏర్పాటుకు రూ.1.50 లక్షలను విరాళంగా అందించారు. వాటితోనే గ్రా మంలో హై క్వాలిటీ గల సీసీ కెమెరాలను ప్రధాన వీధులు, రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా గ్రామంలోకి ఎటువైపు ఎవరు వచ్చినా, వెళ్లినా ప్రతి వారు సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. దాత గోపాల్రెడ్డి సహకారం మరువలేనిది.