మెదక్ రూరల్ ,అక్టోబర్ 5 : ఆపదలో ఉన్న మహిళలు, వేధింపులకు గురైన చిన్నారులకు సఖీ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో రూ. 73.15 లక్షలతో నూతనంగా నిర్మించిన సఖీ భవన కేంద్రాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం బాలసదనం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాధితులు ఎవరైనా సఖీ కేంద్రానికి వచ్చి న్యాయం పొందవచ్చన్నారు. మహిళా భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని ఇందులోభాగంగా మహిళా హెల్ప్లైన్ 181ను ప్రారంభించిందని తెలిపారు. మహిళలు, యువతులు తమకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సఖీ కేంద్రాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఇఫ్కో డైరక్టర్ దేవేందర్రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీ, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.