సంగారెడ్డి, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఒకే జిల్లాలో, ఒకే పదవిలో మూడేండ్లకుపైగా కొనసాగుతున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో కీలకశాఖల్లో పనిచేస్తున్న జిల్లా అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలోని జడ్పీ సీఈవో, డీఆర్డీవో, డీపీవో సహా పలువురు అధికారులు బదిలీఅయ్యారు. వారి స్థానంలో కొత్త అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా పరిషత్ సీఈవోగా ఉన్న ఎల్లయ్య మెదక్ జడ్పీ సీఈవోగా బదిలీ అయ్యారు. వికారాబాద్ జడ్పీ సీఈవోగా పనిచేస్తున్న జానకిరెడ్డి సంగారెడ్డి జడ్పీ సీఈవోగా నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్రావు మెదక్ జిల్లా డీఆర్డీవోగా బదిలీఅయ్యారు.
మహబూబ్నగర్ జడ్పీ సీఈవో ఎం.జ్యోతి సంగారెడ్డి జిల్లా డీఆర్డీవోగా నియామకమయ్యారు. సంగారెడ్డి జిల్లా అదనపు డీఆర్డీవో వామన్రావు కామారెడ్డి జిల్లాకు బదిలీ కాగా ఆయన స్థానంలో సిద్దిపేట డిప్యూటీ సీఈవో బాలరాజు అదనపు పీడీగా నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా సురేశ్మోహన్ రంగారెడ్డి జిల్లా డీపీవోగా బదిలీ అయ్యారు. మెదక్ డీపీవో సాయిబాబా సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా నియామకమయ్యారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.గాయత్రి నాగర్కర్నూల్కు బదిలీ అయ్యారు. వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్చంద్ర సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లాలో మరికొంత మంది జిల్లా అధికారులు బదిలీ కానున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 12: మెదక్ జడ్పీ సీఈవో వెంకట్ శైలేశ్ ప్రిన్సిపాల్ ఈటీసీ కేంద్రం రాజేంద్రనగర్కు, ఆయన స్థానంలో సంగారెడ్డి జడ్పీ సీఈవో ఎల్లయ్య మెదక్ జడ్పీ సీఈవోగా బదిలీ అయ్యారు. డీపీవో సాయిబాబా సంగారెడ్డి జిల్లాకు, డీఆర్డీవో శ్రీనివాస్ వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. డీపీవోగా యాదయ్య సూర్యాపేట నుంచి, డీఆర్డీవోగా శ్రీనివాస్రావు సంగారెడ్డి జిల్లా నుంచి మెదక్కు బదిలీపై వస్తున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహమ్మద్ అబ్దుల్ రజాక్ నిర్మల్ జిల్లాకు బదిలీ అయ్యారు.