దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి గ్రామానికి చెందిన బక్కి వెంకటయ్యకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆయనను చైర్మన్గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దళిత వర్గానికి చెందిన ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. దీంతో ఆయనకు సముచిత స్థానం దక్కింది. దళితనేతగా మంచిపేరు సంపాదించుకోవడంతోపాటు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే లక్షణంతో విమర్శకుల మన్ననలు సైతం అందుకున్నారు.
– దుబ్బాక, సెప్టెంబర్ 21
దుబ్బాక, సెప్టెంబర్ 21 : తెలంగాణ ఉద్యమనేతకు సరైన గుర్తింపు ద క్కింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి గ్రామానికి చెందిన బక్కి వెంకటయ్యకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ప దవి దక్కింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దళిత వర్గానికి చెందిన ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాజకీయంగా, తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎంతో చురుగ్గా పనిచేశారు. దీంతో ఆయనకు సముచిత స్థానం దక్కింది. దళిత నేతగా మంచిపేరు సంపాదించుకోవడంతో పాటు ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే లక్షణంతో ఆయన విమర్శకుల మన్ననలు సైతం అందుకున్నారు. బక్కి వెంకటయ్య క్రమశిక్షణతో రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నేడు ఎస్సీ కమిషన్ చైర్మన్ వరకు ఎదిగారు.
బక్కి వెంకటయ్య 20 ఏప్రిల్ 1967లో అక్బర్పేట-భూంపల్లి గ్రామం లో జన్మించారు. భూంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదివారు. 8 నుంచి పదో తరగతి వరకు పోతారెడ్డిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ ఈపీపీ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్తిచేశారు. ఆ తర్వాత బీఈడీ చదివారు.
1983లో టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని బక్కి వెంకటయ్య ప్రారంభించారు.1988లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన స్వగ్రామమైన భూంపల్లి సర్పంచ్గా పోటీచేసి గెలిచారు.1988-95 వరకు భూంపల్లి సర్పంచ్గా పనిచేశారు. 1992లో ఉత్తమ సర్పంచ్గా (ఉమ్మడి మెదక్ జిల్లా) అవార్డు అందుకున్నారు. 1999-2001 వరకు టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా పనిచేశారు. 1995-2004 వరకు టీడీపీ మిరుదొడ్డి మండల అధ్యక్షుడిగా పనిచేశారు.1995-2001 వరకు రెండోసారి భూంపల్లి గ్రామ సర్పంచ్గా పనిచేశారు. 2001-2006 వరకు టీడీపీ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2001లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీచేసి విజయం సాధించారు.
2001 నుంచి 2006 వరకు దుబ్బాక జడ్పీటీసీగా ఉంటూ మెదక్ జిల్లాలో టీడీపీ జడ్పీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. 2005-2009 వరకు టీడీపీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014-15 వరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2009-2015 వరకు టీడీపీ నియోజకవర్గ బాధ్యుడిగా వ్యవహరించారు. 2015లో టీడీపీ విధానాలు నచ్చక ఆ పార్టీకి గుడ్బై చెప్పి , సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. 2017 నుంచి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ మిరుదొడ్డి పీఏసీఎస్ చైర్మన్గా, డీసీసీబీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. బక్కి వెంకటయ్య సతీమణి బక్కి భాగ్యలక్ష్మి భూంపల్లి సర్పంచ్గా ప్రస్తుతం పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్తో బక్కి వెంకటయ్యకు 40 ఏండ్ల అనుబంధం ఉంది. 1983లో టీడీపీలో సీఎం కేసీఆర్తో పాటు బక్కి వెంకటయ్య చేరారు. వారి మధ్యన ఏర్పడిన రాజకీయ పరిచయం అనుబంధంగా మారింది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో సీఎం కేసీఆర్తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు అనేకమార్లు బక్కి వెంకటయ్య చెప్పారు. ఎక్కడ కనిపించినా తనను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా వెంకటయ్య అంటూ పలుకరిస్తారని ఆయన పేర్కొన్నారు. తనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ దళితనేతగా తనకు సరైన గుర్తింపు ఇచ్చారన్నారు. టీఆర్ఎస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, డీసీసీబీ డైరెక్టర్గా పదువులతో పాటు ప్రస్తుతం ఎస్సీ కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందుకు మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సహకారం మరిచిపోలేనిదని ఆయన పేర్కొన్నారు.