హుస్నాబాద్, జనవరి 6: సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేసేందుకే ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో శనివారం జరిగిన ప్రజాపాలనలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 85వేల దరఖాస్తులు వచ్చాయన్నారు.ఎన్ని సమస్యలు ఎదురైనా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదన్నారు. రాజకీయాలకతీతంగా హుస్నాబాద్ పట్టణంతో పాటు అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
హుస్నాబాద్ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మున్సిపల్ పరిధిలోని హమాలీలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేసేందుకు అవసరమైన వైద్యపరీక్షలు చేయించేలా వైద్యులతో మాట్లాడినట్లు చెప్పారు. త్వరలోనే రూ.250కోట్లతో గౌరవెల్లి రిజర్వాయర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం చేపడుతామని తెలిపారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ , వైస్ చైర్ పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఆర్డీవో బెన్షాలోమ్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఏసీపీ సతీశ్, సీఐ ఎర్రల కిరణ్, కమిషనర్ రాజశేఖర్, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, దొడ్డి శ్రీనివాస్, సరోజన, వల్లపు రాజు, అయిలేని శంకర్రెడ్డి, ఎండీ అయూబ్, శ్రీలత, మున్సిపల్ ఆర్ఐ కృష్ణ, మెప్మా ఇన్చార్జి రాజు పాల్గొన్నారు.
హుస్నాబాద్ 14వ వార్డులో మంత్రి మార్నింగ్ వాక్
హుస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డులో శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి వార్డులోని పలు వీధులను స్వయంగా పరిశీలించారు.వార్డులో ఇంకా కావాల్సిన అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. హమాలీలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలపై ఆరాతీశారు. ఆయన వెంట సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి ఉన్నారు.