ఎందరికో విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేసిన హుస్నాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలకు సిద్ధమైంది. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే ఈ సర్కారు బడి ఊపిరిపోసుకుంది. 1947లో ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటైంది. ఆ తర్వాత ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ఎదిగింది. దాదాపు 25వేల మందికి పైగా విద్యార్థులను తీర్చిదిద్దింది.
హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 20 : హుస్నాబాద్కే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలకు ఇదే ఏకైక ఉన్నత పాఠశాల. మొదటగా ప్రాథమిక పాఠశాలతో మొదలై మళ్లీ మిడిల్ స్కూల్గా మారి ఉన్నత పాఠశాలకు స్థాయికి ఎదిగింది హుస్నాబాద్ ఉన్నత పాఠశాల. నెహ్రూ చౌరస్తాకు సమీపంలోని ప్రైవేట్ వ్యక్తుల ఇంటిలో పురుడు పోసుకున్న ఈ బడిలో తడకల చాటున ఆయా తరగతులను ఉపాధ్యాయులు బోధించేవారు. అలా మెల్లమెల్లగా ఉన్నత పాఠశాలకు ఎదిగిన తరుణంలో తాటికమ్మల గుడిసెల్లో చదువులు అందించిన ఈ బడికి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు చేతుల మీదుగా1956లో సొంత భవనం సమకూర్చుకుంది. అలా మొదలైన ఈ సర్కారు బడికి ఇప్పుడు 75 ఏండ్లు నిండి వజ్రోత్సవాల వేడుకలు జరుపుకోవడానికి సిద్ధ్దమైంది.
ఈ పాఠశాలలో 1947 నుంచి 2022 వరకు దాదాపు 25 వేల మందికి పైగా విద్యనభ్యసించారు. వజ్రోత్సవాల నేపథ్యంలో పాఠశాలను ముస్తాబు చేస్తున్నారు. తరగతి గదులకు రంగులు వేయడం, ఆవరణ అంతా చదును చేసే పనులు చేస్తున్నారు. ఈ బడిలో చదివిన పూర్వ విద్యార్థులందరూ తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా యాప్ను సైతం తయారు చేశారు. ఇప్పటి వరకు 1500 పైగా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రత్యేకంగా పైలాన్ను సైతం నిర్మిస్తున్నారు. ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి, ప్రముఖ కళాకారుడిగా పేరొందిన గాజుల రజినీశ్రీ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ప్రస్తుత కరీంనగర్ అదనపు కలెక్టర్ గాజుల శ్యాంప్రసాద్లాల్ పైలాన్ను తన సొంత ఖర్చులతో నిర్మిస్తున్నారు. సరస్వతిమాత, పూలే విగ్రహాలను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.
హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన వారు ఎంతోమంది ఉన్నతస్థానానికి ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించిన సిరికొండ మధుసూదనాచారి, ప్రస్తుత కరీంనగర్ అదనపు కలెక్టర్ గాజుల శ్యాంప్రసాద్లాల్, ఒకనాటి కేయూ వీసీ లింగమూర్తి, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ తాళ్లపల్లి శ్రీనివాస్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిలేని విద్యాధర్రెడ్డి, కంట్రోలర్ అఫ్ ఎగ్జామినర్ బెనర్జీ, ప్రొఫెసర్ జోగాచారి, మనోహరాచారి సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్, పెద్దపల్లి ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ కొండ శ్రీధర్, అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బోజు శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త పూదరి వెంకట్రాజం, రైతు రుణ విముక్తి సభ్యుడు కవ్వ లక్ష్మారెడ్డి, రిటైర్డ్ ఆర్టీవో అయిలేని జైపాల్రెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అయిలేని శ్రీనివాసరెడ్డి, పలువురు డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, మిలటరీ, ఎయిర్ఫోర్స్, నేవీ, పోలీసుశాఖ, రాజకీయ పార్టీల నాయకులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులతో పాటు పారిశ్రామిక వేత్తలుగా పలు రంగాల్లో రాణిస్తున్న అనేక మందిని తీర్చిదిద్దింది ఈ చదువుల తల్లి హుస్నాబాద్ సర్కారు బడి.
హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యనభ్యసించేందుకు దివంగత ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు కృషిచేశారు. పాఠశాలకు స్థలాన్ని సేకరించి పలువురు ఉపాధ్యాయులను నియమించి విద్యాభివృద్ధికి కృషిచేశారు. హుస్నాబాద్లో ప్రభుత్వ పాఠశాల ఉందని, మీ పిల్లలను స్కూల్కు పంపించాలంటూ స్వయంగా పలు గ్రామాలకు వెళ్లి ఆయా గ్రామాల పెద్దలకు విషయాన్ని వివరించి చదువుకునేలా ఆయన ప్రోత్సహించారు.ఉపాధ్యాయులను నియమించి వారికి సొంత జేబులోంచి వేతనం ఇస్తూ, తన ఇంటిలోనే వారికి ఆశ్రయం కల్పించారు. అందుకే ఈ
ప్రాంత వాసులు బొప్పరాజు లక్ష్మీకాంతరావును గుర్తుకు తెచ్చుకుంటారు.
ఈ బడిలో ఉపాధ్యాయునిగా చేరి ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేసిన డీవీఆర్ నర్సయ్య అంటే ఈబడిలో చదువుకున్న విద్యార్థులకు అమితమైన ప్రేమ. విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను నిత్యం తెలుసుకోవడంతో పాటు చక్కటి బోధనను అందించి వేలాదిమంది తీర్చిదిద్దిన సార్గా విద్యార్థుల మదిలో ఆయన నిలిచిపోయారు.
23 నుంచి వేడుకలు…
హుస్నాబాద్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలు వారం పాటు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23న ఆదివారం నుంచి మే 1వ తేదీ సోమవారం వరకు వేడుకలు జరగనున్నాయి. 23న పైలాన్ ఆవిష్కరణ, ప్రారంభ సమావేశం, గాంధీ విగ్రహం నుంచి పాఠశాల వరకు ర్యాలీ, ఉపాధ్యాయులకు సన్మానం, 24న చిత్రలేఖన, సాంస్కృతిక కార్యక్రమాలు, బైక్ర్యాలీ, 25న కవి సమ్మేళనం, సెమినార్, 26న రక్తదాన శిబిరం,ఉచిత వైద్యశిబిరం, 27న ఆటల పోటీలు, 28న మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, 29న న్యాయ సదస్సు, 30న వజ్రోత్స కమిటీ సభ్యుల సమావేశం, మే 1న ముగింపు సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిటీ తెలిపింది. 23న ప్రారంభ సమావేశానికి విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ హాజరు కానున్నారు. 25న నిర్వహించే కవి సమ్మేళనానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరు కాన్నున్నారు. మే1న నిర్వహించే ముగింపు సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ హాజరు కానున్నారు. పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు సైతం హాజరు కానున్నారు.
ఇక్కడనే 70శాతం పాసయ్యేవారు…
అన్నిప్రాంతాల్లో విద్యార్థుల్లో ఇరవై శాతం మాత్రమే పరీక్షల్లో పాసయ్యేవారు. హుస్నాబాద్లో మాత్రం 70శాతం మాత్రం పాసయ్యేవారు. అప్పటి విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఉపాధ్యాయుల అంకితభావంతోనే అలా చదవగలిగాను. ఏ పాఠశాల, కళాశాలలో చదివినా రూల్నంబర్ 1 నాదే కావడం ఎంతో సంతోషంగా ఉండేది. ఎందుకంటే అందరికంటే నేనే చిన్నగ ఉండేది. హుస్నాబాద్లో విద్యావ్యాప్తికి కృషిచేసిన నాయకుడు బొప్పరాజు లక్ష్మీకాంతారావు. ఆయనతోనే ఎంతోమంది చదువుకోగలిగారు.
– జనగామ రామకిషన్రావు, పూర్వవిద్యార్థి (మాజీ లోక్అదాలత్ సభ్యుడు, హుస్నాబాద్)
వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషకరం
ఈ బడిలో చదువుకున్న ఎంతోమంది దేశావిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. హుస్నాబాద్ పాఠశాల వేలాది మందికి విద్యాదానం చేసింది. ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో చదువుతో పాటు ఆటపాటలు ,సాంస్కృతిక కార్యక్రమాలకు సైతం పేరొందిన విద్యాలయం. జిల్లా, రాష్ట్రస్థాయిలో సైతం అనేక అవార్డులను అందుకున్నది . వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషకరం.
– మహ్మద్ ఫజల్ రహమాన్, పూర్వ విద్యార్థి (సీనియర్ జర్నలిస్టు)
ఆ పునాది మెట్లే ఈ హోదాను ఇచ్చాయి..
హుస్నాబాద్ బడి మెట్లే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆనాటి ఉపాధ్యాయులు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయడంతో నేను జీవితంలో ముందుకు పోయేందుకు దోహదం చేశాయి. మా నాన్న గురువుగా, నేను విద్యార్థిగా ఒకే పాఠశాలలో ఉండటం మరిచిపోలేని అనుభవం. స్కూల్ రోజులు ఇప్పటి నా మదిలో మెదలుతున్నాయి.
– గాజుల శ్యాంప్రసాద్లాల్, పూర్వ విద్యార్థి (కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్)
ఆ పాటలు ఇప్పటికీ మరిచిపోలేదు..
బడిలో రికార్డింగ్ మైకు ఉండేది. ఆడవోయి భారతీయుడు.. ఆడిపాడవోయి భారతీయుడా అనే పాట ఇప్పటికీ మరిచి పోలేదు. బడికి ఆరగంట ముందుగానే పోయేది. అప్పుడు అన్ని ఆటలు ఆడుకునేది, చదువుకునేది. సార్ల క్రమశిక్షణే నన్ను టీచర్ను చేసింది.
– వరయోగుల సుదర్శనస్వామి, పూర్వ విద్యార్థి (రిటైర్డ్ ఉపాధ్యాయుడు హుస్నాబాద్)