కౌడిపల్లి, మే 5: ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి దర్శనానికి వెళ్లి, అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కౌడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మహమ్మద్నగర్ గేటు వద్ద శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన నాగలింగరాజ్ (36), అతని భార్య సప్పిడి రమ (33) భార్యాభర్తలు. నాగలింగరాజు ఆటో డ్రైవర్. వారు సూరారంలోని సాయిబాబానగర్ కాలనీలో అద్దెకు నివసిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు మరో ముగ్గురితో కలిసి ఏడుపాయల్లోని దుర్గాభవానీ మాత దర్శనానికి ఆటోలో వెళ్లారు. శుక్రవారం దుర్గాభవానీ దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కౌడిపల్లి మండలంలోని మహమ్మద్నగర్ గేటు వద్ద టాటా ఏస్ ఆటో అదుపుతప్పి హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఉన్న మహిళలు లత, అమృత, దర్శినికి తీవ్ర గాయాలయ్యా యి. మృతుల పిల్లలు వెంకటలక్ష్మి, వైశాలి, అమృత, అవంతికకు స్వల్ప గాయాలయ్యాయి. అతివేగంగా ఆటో, బస్సును ఢీకొనడంతో ఆటోలో మృతదేహా లు ఇరుక్కుపోయాయి. జేసీబీ సహాయంతో బయటకు తీశారు. గాయపడిన వారిని నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనా స్థలానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం దవాఖానకు తరలించామని డీఎస్పీ యాదగిరిరెడ్డి తెలిపారు. విషయం తెలిసిన పలువురు ప్రజా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని పరామర్శించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.