మెదక్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏడుపాయల దుర్గా భవాని జాతరను వైభవోపేతంగా నిర్వహించామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచనలు, ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా అధికారుల సమిష్టి సహాకారంతో గత నెల 18 నుంచి 20వరకు మూడు రోజుల పాటు జరిగిన జాతరను విజయవంతం చేశామని ఇందుకు సహకరించిన ప్రతి ఒకరికి ధన్యవాదాలను తెలుపుతున్నానని కలెక్టర్ చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మహాశివరాత్రి జాతర ముగింపు అభినందన సభ లో మా ట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించామని, విజిలెన్స్ బృందాలను పెట్టి భక్తుల అభిప్రాయాలు సేకరించామని, వచ్చే జాతరకు మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామన్నారు.
80శాతం భక్తులకు సౌకర్యాలు కల్పించాం : మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ గతం లో జాతరకు వచ్చే భక్తులకు కొన్ని ఇబ్బందులు కలిగిన ఈ జాతరలో 80శాతం మేర భక్తులకు సౌకర్యాలు కల్పించి మన్ననలు పొందామన్నారు. కలెక్టర్ కొత్తగా వచ్చిన గత జాతర మినిట్స్ ఆధారంగా అధికారులను సమన్వయ పరు స్తూ భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా షవర్లు, టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం చకగా ఏర్పాట్లు చేశారని అన్నారు. శానిటేషన్ కార్యక్రమాలు చకగా చేశారని, విద్యుత్లో అంతరాయం కలగకుండా చూశారని అన్నారు.
వచ్చే జాతరకు ముందస్తు ప్రణాళికతో శాశ్వత నిర్మాణాలు చేపట్టేవిధంగా అధికారులు, పాలక వర్గం చొరవ చూపాలని ఆమె అన్నారు. అనంతరం ఏడుపాయల జాతరలో ఉత్తమ సేవలందించిన అధికారులకు, పాలక వర్గానికి, అర్చకులకు, మండల నాయకులకు శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, ఇఫో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు జగన్, ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్, పాలక వర్గ సభ్యులు, మండల వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్రెడ్డి, నాగ్సాన్పల్లి సర్పంచ్ సంజీవరెడ్డి, ఎంపీటీసీ, ప్రజాప్రనిధులు తదితరులు పాల్గొన్నారు.