కంగ్టి, జనవరి 27: గతంలో ఎకరా భూమిలో వేరుశనగ సాగుచేస్తే 3 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చేది. దీంతో రైతులు సాగుకు వెచ్చించిన పెట్టుబడి ఖర్చులు గిట్టుబాటు అయ్యేది కాదు. వేరుశనగలో మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు వివరించడంతో వారు పాటిస్తున్నారు. దీంతో వేరుశనగలో దిగుబడిపెరిగిందని చెప్తున్నారు.
బాబుల్గామ రైతుల్లో ఆనందం…
కంగ్టి మండలంలో బాబుల్గామ గ్రామ శివారులో చాలా మంది రైతులు తమ వ్యవసాయ భూముల్లో వేరుశనగ పంట సాగు చేస్తున్నారు. గ్రామానికి ఆనుకుని కౌలాస్నాలా ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ ఉండడంతో దశాబ్దాల నుంచి వేరుశనగ సాగు చేస్తున్నారు. అయినా వారికి రాబడికి మించి ఖర్చులు ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది. దీంతో బాబుల్గామ గ్రామానికి సంతోష్ ఏఈవోగా నియామకమయ్యారు.
సత్ఫలితాలిస్తున్న అధికారుల సలహాలు…
గత సంవత్సరం గ్రామంలో వందల ఎకరాల్లో యాసంగి సీజన్లో భాగంగా వేరుశనగను సాగు చేశారు. వేరుశనగ తప్పనిసరిగా జిప్సం మిశ్రమాన్ని అడుగులో వేయాలని దీంతో నేలలో భాస్వరం అధికం కావడంతో దిగుబడి అధికమవుతుందని ఏఈవో సంతోష్ అవగాహన కల్పించారు. అప్పట్లో కేవలం 10 మంది రైతులు మాత్రమే జిప్సాన్ని ఉపయోగించి వేరుశనగను సాగు చేశారు. దీంతో ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతో రైతులు చాలా సంతోషించారు. ఈ ఏడాది యాసంగిలో బాబుల్గామతోపాటు జీర్గి తండా, చింతల్వాడి తండా, బోర్గి తదితర గ్రామాల్లో సైతం రైతులు వేరుశనగలో జిప్సాన్ని ఉపయోగించారు.
వేరుశనగలో జిప్సంతో అధిక దిగుబడి
వేరుశనగలో జిప్సంతో అధిక దిగుబడి సాధించుకోవచ్చు. కంగ్టి ప్రాంతాంలోని నేలల్లో కాల్షియం తక్కువగా ఉండడంతో వేరుశనగలో దిగుబడి తక్కువగా ఉండేది. దీన్ని గమనించి జిప్సం వేయాలని సూచించాను. దీంతో నేలలో కాల్షియం అధికమై భూసారాన్ని పెంచుతుంది. తద్వారా అధిక దిగుబడి సుసాధ్యమవుతుంది. – సంతోష్, ఏఈవో, బాబుల్గామ, కంగ్టి
దిగుబడి 50 శాతం పెరిగింది…
కొన్ని సంవత్సరాల నుంచి వేరుశనగను సాగుచేస్తున్నాను. అయినప్పటికీ రాబడికి మించి పెట్టుబడి ఖర్చులు అయ్యేవి. గ్రామ ఏఈవో సంతోష్ సూచన మేరకు వేరుశనగలో జిప్సమ్ మిశ్రమాన్ని అడుగుల్లో వేస్తున్నాం. దీంతో ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గతంలో కన్నా 50 శాతం దిగుబడి అధికమైంది.
– జాదవ్ గణేశ్, వేరుశనగ రైతు, జీర్గి తండా, కంగ్టి