ఝరాసంగం, ఆగస్టు 27: ఆకు కూరలు తినడంతో ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని పలువురు వక్తలు తెలిపారు. మండలంలోని మాచునూర్ గ్రామ శివారులో డీడీఎస్ (దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) డైరెక్టర్ పీవీ.సతీశ్ వ్యవసాయ క్షేత్రంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ వారు శనివారం పర్యటించారు. పంటల సాగు విధానాన్ని డాక్టర్ జానికి శ్రీనాథ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చిన రైతులు పరిశీలించారు. కలుపు, పంటలోని పిచ్చి మొక్కలు తొలిగించారు. అనంతరం పచ్చసాలెలో నిర్వహించిన ఆకు కూరల పండుగలో పాల్గొన్నారు. ఆకు కూరలతో తయారు చేసిన ఆహారాన్ని భోజనం చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రకృతి అభిమానులు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పండిస్తున్న చిరుధాన్యాలు చూసి అభినందించారు. డీడీఎస్ చేస్తున్న వ్యవసాయం దేశానికే ఆదర్శమన్నారు. ప్రత్యేకంగా మహిళా రైతులు చిరుధాన్యాలు సాగు చేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. విత్తనాలు నిల్వ చేసుకుని సాగు చేయడంతో నష్టం ఉండదన్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలన్నారు. డీడీస్ డైరెక్టర్ పీవీ సతీశ్ మాట్లాడుతూ ఎక్కువ శాతం మంది సూపర్ మార్కెట్లో చిరుధాన్యాలు కొనుగోలు చేస్తున్నారన్నారు. చిరుధాన్యాలకు ఎంతో డిమాండ్ పెరిగిందన్నారు. రసాయన ఎరువులతో పంటలు సాగు చేయడంతో అధిక రోగాలు వస్తున్నాయన్రాఉ. సేంద్రియ ఎరువులతో సాగు చేసిన ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీడీఎస్ రేడియో కో ఆర్డినేంటర్లు నరమ్మ, పుల్లమ్మ, బాలయ్య, తుకారాం, రైతులు తదితరులు పాల్గొన్నారు.