సిద్దిపేట, మార్చి 13: టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించామని, ఇందుకు విద్యాశాఖతో కలిసి సమీక్షలు నిర్వహించి అన్ని వసతులు కల్పించామని చెప్పారు.
మీ భవిష్యత్కు పునాది పదో తరగతే అని.. ఇష్టపడి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి అల్పాహారం ఏర్పా టు చేయించానన్నారు. డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపించానని గుర్తుచేశారు. అధిక మారులు సాధించినవారు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు పొంది ఉన్నత విద్య అభ్యసిస్తున్నారన్నారు. మీరంతా ఏకాగ్రత తో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని కోరుతూ టెన్త్ విద్యార్థులకు ఆయన ఆల్ది బెస్ట్ చెప్పారు.