గుమ్మడిదల, జూలై 16 : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భరోసా ఇచ్చారు. గుమ్మడిదలలోని 157 ఎకరాల అసైన్డ్ భూమిని ఇండస్ట్ట్రియల్ పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికోసం జిల్లా, మండల రెవెన్యూ అధికారులు రైతుల జాబితాను సిద్ధం చేశారు. గతంలో ఆర్డీవో, తహసీల్దార్ పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాన్ని సేకరించారు.
రైతులకు న్యాయపరంగా రావాల్సిన పరిహారాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ. 15 లక్షలు ఇస్తామని అధికారుల నుంచి సమాచారం రావడంతో రైతులు మండిపడుతున్నారు.
హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న గుమ్మడిదల మండలంలో భూములకు అధిక ధర ఉందని, ఎకరానికి సుమారుగా రూ.4 నుంచి 5 కోట్ల రూపాయలు ధర పలుకుతున్న భూములను రూ.15 లక్షలు, ఇండ్ల స్థలానికి మూడు వందల గజాల భూమిని ఇస్తామని అధికారులు చెబుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి గుమ్మడిదల రైతులతో బుధవారం హైదరాబాద్లో హరీశ్రావును కలిసి వివరించారు. ఈ భూములు కొన్ని దశాబ్దాలుగా రైతుల వినియోగంలో ఉన్నప్పటికి, రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదని, ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో వారికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. వీరితో పాటు బీఆర్ఎస్ జిన్నారం మండలాధ్యక్షుడు రాజేశ్, నాయకులు చంద్రారెడ్డి, సూర్యనారాయణ, ఆంజనేయులు యాదవ్ తదితరులు ఉన్నారు.