రామచంద్రాపురం, ఫిబ్రవరి 20: రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని, పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి నివాసంలో గురువారం రాత్రి ఐదు మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలకు చెందిన చైర్మన్లు, వైస్చైర్మన్లు, కౌన్సిలర్లకు ఆయన శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడం సంతోషమన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేసి పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓట్లర్లకు వివరించడంలో బీఆర్ఎస్ శ్రేణులు సక్సెస్ అయ్యారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని అరాచకాలు, నిర్బంధాలు, దౌర్జన్యాలు చేసినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వాటన్నింటిని తట్టుకొని పార్టీకి విజయాన్ని కట్టబెట్టారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో బీఆర్ఎస్ శ్రేణులు ముందుకువెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని సూచించారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని, రెండేండ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఫైనాన్స్ మాజీ కమిషన్ సభ్యుడు గోసుల శ్రీనివాస్యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్లు పావని, సుష్మ, సుమలత, ప్రమీల, జనార్దన్, వైస్ చైర్మన్లు మహేందర్గౌడ్, సంధ్య, హరీశ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పట్నం మాణిక్యం, మెట్టుకుమార్, గోవర్ధన్రెడ్డి, సోమిరెడ్డి, అంజయ్య, బాల్రెడ్డి, శ్రీకాంత్గౌడ్, కాటారాజు, విష్ణువర్ధన్, పృథ్వీ, మాణిక్ యాదవ్, శ్రీనివాస్రెడ్డి, కుమార్గౌడ్, జగన్నాథ్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.