పేదింటి కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఓ పెద్దన్నలా.. కొడుకులా ఉంటూ ‘ఆసరా’ అందిస్తూ వారి మోముల్లో చిరునవ్వులు చిందిస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో నూతన ఆసరా కార్డులను మెదక్ ఎంపీ , టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మాట మీద నిలబడేదెవరో? మాటలు తప్పేదెవరో ప్రజలు ఆలోచన చేసి, నీళ్లు ఏవో? పాలు ఏవో గమనించాలన్నారు. పింఛన్లలో కూడా మా వాటా ఉందని బీజేపీ అంటోందని, కానీ, అందులో ఒక్క పైసా వారిది లేదన్నారు. ‘నియ్యత్తోనే బర్కత్.. తిన్నరేవును తలిచేలా ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ను గుర్తు పెట్టుకొని గుండెల్లో దాచుకోవాలి’.. అని అన్నారు.
దుబ్బాక/దుబ్బాక టౌన్, ఆగస్టు 27 : ‘రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చాయి.. వారి కండ్లల్లో ఆనందం వెల్లువిరుస్తున్నది. ఓ పెద్దన్నగా.. ఇంటికి పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి ఆసరాగా నిలువడం ప్రజలు చేసుకున్న అదృష్టం.. రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలు ఆసరా పింఛన్లతో దర్జాగా బతుకుతున్నారు. నియ్యత్తోనే బర్కత్.. తిన్నరేవును తలిచేలా ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ను గుర్తు పెట్టుకొని గుండెల్లో దాచుకోవాలి’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలోని రజినీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో కొత్త పింఛన్ కార్డులను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీడీపీ హయాంలో రూ.50 ఇచ్చే పింఛన్, ఇంకొకరి చావును కోరేలా ఉండేదన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రూ.200 పింఛన్ బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కన్న కొడుకులా ప్రతి నెలా రూ.2016ను అందిస్తూ దర్జాగా బతికే విధంగా ధీమాను కల్పించాడని మంత్రి తెలిపారు. దుబ్బాక పట్టణంలో 816, మండలంలో 988 మొత్తం 1804 మందికి కొత్త పింఛన్లను అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందజేస్తుండగా, దుబ్బాక నియోజకవర్గంలో 50 వేల మంది లభ్ధిదారులకు ఆసరా పింఛన్లను ఇస్తున్నామని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే అర్హులైన వారందరికీ అందజేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు.
కాళేశ్వరంతో గోస తీరింది..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అటు సాగునీరు, ఇటే తాగు నీటి గోస తీరిందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రెండు నెలలుగా కూడవెల్లి వాగు చెక్డ్యాంలను దాటి జోరుగా ప్రవహిస్తుండడం కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమేనన్నారు. నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి తాగునీటి కోసం బోరు బావులు వేయించి ప్రజల కోసం పడరాని పాట్లుపడ్డారని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మిషన్భగీరథ తెచ్చి దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నల్లా బిగించి తాగునీరు అందించి నీటి గోసను తీర్చాడని మంత్రి తెలిపారు. దేశంలో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని మంత్రి అన్నారు.
దుబ్బాకకు వరాలు
దుబ్బాక ప్రజలకు మంత్రి హరీశ్రావు పలు అభివృద్ధి పనులను మంజూరు చేశారు. వంద పడకల దవాఖానకు మంజూరైన డయాలసిస్ కేంద్రాన్ని మరో 15 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా దవాఖానలో న్యూబర్న్ స్టేబిలైజేషన్ యూనిట్ను నూతనంగా మంజూరు చేశారు. డబుల్బెడ్ రూంల వద్ద బస్తీ దవాఖాన ఏర్పాటుతో పాటు భూంపల్లిలో రూ.కోటి 56 లక్షలతో నూతన పీహెచ్సీ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. దుబ్బాక మున్సిపాలిటీకి జేసీబీతో పాటు 4 చెత్త సేకరణ ఆటోలు, వీధి లైట్ల ఏర్పాటుకు స్టాండ్ను మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ప్రెస్క్లబ్తో పాటు ఇంటి స్థలాలను కలెక్టర్తో సంప్రదించి, త్వరలోనే అందజేస్తామని హామీనిచ్చారు.ఎమ్మెల్యే రఘునందన్రావు, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జట్పీటీసీ రవీందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వనితాభూంరెడ్డి, వైస్ చైర్పర్సన్ అధికం సుగుణాబాలకిషన్గౌడ్, కౌన్సిలర్లు, డీఆర్డీఏ పీడీ గోపాల్రావు, ఎంపీడీవో భాస్కరశర్మ, తహసీల్దార్ సలీం పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందనలు
బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన లచ్చపేట మోడల్ స్కూల్కు చెందిన 16 మంది విద్యార్థులను మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అభినందించి సన్మానించారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుప్రియను అభినందించారు.
రూ.6 కోట్ల 73 లక్షల రుణాలు..
దుబ్బాకలోని డ్వాక్రా సంఘాలకు మంత్రి హరీశ్రావు రూ. 6కోట్ల 73 లక్షల రుణాలను 96 స్వ యం సహాయక సంఘాలకు అందజేశారు.13 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ఐదు షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
వాగ్ధానాలను నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్దే
చేసిన వాగ్ధానాలను నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. అందరి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ తెలంగాన రాష్ర్టాన్ని సంక్షేమంలో ముందు వరుసలో నిలిపారు. నిరుపేదలైన అభాగ్యులకు ఆసరా పింఛన్లతో ఆదుకుంటూ వారి జీవితాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 57ఏండ్లకే అందించే కొత్త పింఛన్లను దుబ్బాక నియోజకవర్గం నుంచే మొదలు పెట్టడం సంతోషకరం. నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ లబ్ధిదార్లకు ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు.
– ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
ఎంతో సంతోషకరమైన రోజు
టీఆర్ఎస్ ప్రభుత్వం అందించే పెన్షన్ రూ.2016 పేద ప్రజలు ధైర్యంగా బతుకుతున్నారు. పెద్దసంఖ్యలో పింఛన్లు మం జూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ పాలనపై సంతోషంగా ఉన్నారు. టీఆర్ఎస్ వెంటే ఉంటూ సీఎం గా కేసీఆరే కావాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల దీవెనలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొండంత బలం.
– ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్