సిద్దిపేట, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ సిద్దిపేట, ఆగస్టు 22: పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శనివారం సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాజ్గోపాల్పేట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఆ మార్గంలో వెళ్తున్న హరీశ్రావు విద్యార్థుల ఆందోళనను గమనించి వారికి సంఘీభావం తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరో వైపు విద్యార్థులు సాయంత్రం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్రావును కలిశారు. పాలిటెక్నిక్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 వల్ల భవిష్యత్ అంధకారంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సింది పోయి ఉన్నవ్యవస్థను మార్చడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ విద్యాచట్టం పరిధి నుంచి తొలిగించి యంగ్ ఇండియా సిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చే ప్రయత్నం దారుణమన్నారు. భవిష్యత్లో నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్ను ప్రభావితం చేసే ఇలాంటి నిర్ణయాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలో కలపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యార్థుల సమస్యలు పరిషరించాల్సిన మంత్రి వివేక్ రేపు నేను ఓడిపోతానేమో, మా ప్రభుత్వం పోతుందేమో.. నేనెట్లా హామీ ఇవ్వాలి? అని మాట్లాడటం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ హయాంలో 400 మందికి పైగా కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి పర్మినెంట్ చేశామని, నేడు కాంగ్రెస్ 97 జీవో తెచ్చి పాలిటెక్నిక్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తోందన్నారు.
ఢిల్లీలో విద్యార్థులకు అన్యాయం జరిగితే వెళ్లి పరామర్శించే రాహుల్గాంధీ.. తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహబూబాబాద్లో సీఐ పాలిటెక్నిక్ విద్యార్థి గొంతుపై బూటు కాలువేసి దారుణంగా ప్రవర్తించారన్నారు. ఈఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ వెంటనే స్పందించాలన్నారు. దారుణంగా ప్రవర్తించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశానని, అసెంబ్లీలో విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఆయన హామీ ఇచ్చారు.