మెదక్ రూరల్/సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్3: దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని, అంగ వైకల్యం దేనికీ అడ్డురాకూడదని, నిజ జీవితంలో సకలాంగుల కన్నా మీరే హీరోలని మెదక్ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్చంద్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బోధన్ చౌరస్తా నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు దివ్యాంగుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అనుకున్న లక్ష్యసాధన దిశగా ఆత్మ ైస్థెర్యంతో ముందడుగు వేస్తే విజయం వరిస్తుందన్నారు. పరిపాలనా, న్యాయపరమైన సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవా సమితిని సంప్రదించి దరఖాస్తు ఇస్తే న్యాయ సహాయం అందిస్తామన్నారు.
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ దివ్యాంగులు, వయెవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసిందన్నారు. గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమైన ఈ శాఖతో భిన్న పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, మరింత మెరుగైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అందించాలని ప్రత్యేక శాఖను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి బ్రహ్మజీ మాట్లాడుతూ జిల్లాలో 12,986 మంది దివ్యాంగులున్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో జరిగిన పరుగు పందెం, జావెలిన్ త్రోలో గెలుపొందిన కవిత, ప్రసాద్, ట్రైసైకిల్ విజేత యాదగిరి, నవీన్కు అదనపుకలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా స్థాయిలో జరిగిన ఆటలపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ సైదులు, డీఈవో రమేశ్కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, మోప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఇందిర, సీడీపీవోలు హేమభార్గవి, ఏపీఎంలు, దివ్యాంగ సంఘాల నాయకులు అశోక్, స్వామి, రియాజుద్దీన్, సాయిలు, యాదయ్య, సంతోషి పాల్గొన్నారు
దివ్యాంగులు, సవ్యాంగులకు ఏమాత్రం తీసిపోరని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఏదైనా సాధించగలమన్న పట్టుదల, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. లక్ష్యానికి వైక ల్యం అడ్డు కారాదన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి జె.హనుమంతరావు మాట్లాడుతూ దివ్యాంగులకు ఎలాంటి న్యాయ సహాయం అవసరం ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాలన్నారు. అనంతరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, మెప్మా పీడీ గీత, జడ్పీ సీఈవో ఎల్లయ్య పాల్గొన్నారు.