నర్సాపూర్, ఫిబ్రవరి 3: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మనఊరు మనబడి కార్యక్రమంతో నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది. శిథిలావస్థకు చేరుకున్న భవనాల రూపురేఖలు మారుస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. నర్సాపూర్ మండలంలో మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 23 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. అన్ని పాఠశాలల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
నారాయణపూర్ పాఠశాలలో తీరిన ఇబ్బందులు
మండలంలోని నారాయణపూర్ ప్రాథమిక పాఠశాల పనులు చివరి దశకు చేరుకున్నాయి. మన ఊరు మనబడికి ముందు పాఠశాల అధ్వానంగా ఉండేది. కనీస వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ప్రహరీ లేక పశువులు పాఠశాల ఆవరణలోనే ఉండేవి. అప్పుడప్పుడు పాములు కూడా పాఠశాలలో దర్శనమిచ్చేవి. వంట గది లేక విద్యార్థులకు వంట చేయడం, టాయ్లెట్స్ సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బందులు, నీటి సౌకర్యం సరిగ్గా లేక బయటకెళ్లడం, విద్యుత్ సౌకర్యం లేక ఉక్కపోతకు గురయ్యేవారు. ఇతర సదుపాయాలు లేక నానా అవస్థలు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం మనఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పాఠశాలలోని సమస్యలను పరిష్కరించడానికి రూ.41 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పాఠశాలలో ప్రహరీ, వంట గది, ఎలక్ట్రికల్ వర్క్, కిచెన్ షెడ్, టాయ్లెట్స్, వాటర్ సంపు, కొలాయిలు, ఆరు గ్రీన్ చాక్ బోర్డులు తదితర పనులను చేపట్టారు. ఒక్కో బోర్డుకు రూ.16 వేలు వెచ్చించి, 6 బోర్డులు తెప్పించారు. పాఠశాలలో అదనపు గదిని కూడా నిర్మించారు. పాఠశాలలో సౌకర్యాలు మెరుగవడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంతో పాఠశాల నూతన శోభను సంతరించుకున్నదని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది
మా స్కూల్లో ఇన్ని పను లు చేయడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు పాఠశాలకు చుట్టూ గోడ లేక చాలా ఇబ్బందులు పడ్డాం. పశువులు, పాములు పాఠశాల మైదానంలోకి వచ్చేవి. ఇప్పుడు గోడ కట్టడంతో సమస్యలు తీరిపోయాయి. ఇదంతా మా స్కూలే అనే భావన మాలో కలిగింది. టాయ్లెట్స్ లేక చాలా అవస్థలు పడ్డాం. ఇప్పుడు ఎంతో చక్కగా టాయ్లెట్స్ కడుతున్నారు.
– జోగినాథ్, విద్యార్థి, 5వ తరగతి
కరెంట్ లేక ఇబ్బందులు పడ్డాం
మా బడిలో కరెంట్ లేక చా లా ఇబ్బందులు పడ్డాం. ఎండా కాలం వచ్చిందంటే ఉక్కపోతతో నానా అవస్థలు పడే వాళ్లం. ఇప్పడు ప్రభుత్వం కరెంట్ ఇచ్చి అందులో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారు. బ్లాక్ బోర్డు నుంచి వచ్చే సుద్ద పొడితో ఇబ్బందిగా ఉండేది. నేడు గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మంచి వసతులు ఇప్పుడు మా బడిలో ఉన్నాయి.
– సరస్వతి, విద్యార్థి, 5వ తరగతి