ప్రజలకు ప్రభుత్వ పాలనను మరింత చేరువ చేయడంతోపాటు నాణ్యమైన సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. కొత్త పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజారంజక పాలన చేస్తున్నారు. బుధవారం నిర్వహించిన ప్రజాశంఖారావం సభలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ జీవో 284ను విడుదల చేశారు. రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాలతో కలిపి కొత్త డివిజన్ ఏర్పడనున్నది. పటాన్చెరును రెవెన్యూ డివిజన్తో పాటు పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది. కొద్దిరోజుల క్రితమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మున్సిఫ్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్ లభించగా, త్వరలో రెవెన్యూ డివిజన్ సైతం అందుబాటులోకి రానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అడిగినవన్నీ అందిస్తూ తమ నియోజవకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యేలు, పద్మాదేవేందర్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
పటాన్చెరు, ఆగస్టు 25: మినీ ఇండియాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జూన్ 22న పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు భూమిపూజ చేసేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. శుక్రవారం సీఎం ఆదేశాలతో కొత్త రెవెన్యూ డివిజన్గా పటాన్చెరును ఆమోదిస్తూ జీవో విడుదలయ్యింది. దాంతో పాటు కొత్తగా పాలిటెక్నిక్ కళాశాల మంజూరయ్యింది. దీంతో పటాన్చెరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కొత్తగా మున్సిఫ్ కోర్టు మంజూరైంది. రెవెన్యూ డివిజన్ కావడంతో తాలూకాస్థాయి కార్యాలయాలన్నీ ఒక్కోటిగా మంజూరవుతున్నాయి. పటాన్చెరు అనగానే పారిశ్రామికవాడగా కండ్ల ముందు కార్మికులు కనిపిస్తారు. లక్షలాది వలస కార్మికులు ఉండటంతో ఉమ్మడి జిల్లాలోనే పటాన్చెరు నియోజకవర్గం భిన్నంగా కనిపిస్తుంది. దాదాపు 6లక్షలకు పైగా జనాభాతో శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న ప్రాంతం పటాన్చెరు నియోజకవర్గం. మారుమూల ఉన్న గ్రామాలు కూడా కొత్తగా వెలుస్తున్న వెంచర్లు, కంపెనీలతో జిగేల్ మంటున్నాయి. పెరుగుతున్న జనాభాకు సరిపోను మౌలిక వసతులను కల్పించేందుకు తెలంగాణ సర్కార్ శ్రమిస్తున్నది. తొమ్మిదేండ్లలో కొత్తగా గుమ్మడిదల, అమీన్ఫూర్ మండలాలు ఏర్పాటు చేశారు. వాటితో పాటు అమీన్ఫూర్, తెల్లాపూర్, బొల్లారంను మేజర్ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేశారు. కొత్త పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు రావడంతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయి. చక్కటి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అనేక ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుంచారు. అందులో ప్రధానమైంది 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రతిపాదన. సీఎం కేసీఆర్ స్పందించి పటాన్చెరు పట్టణానికి రూ.183 కోట్ల విలువైన సూపర్ స్పెషాలిటీ దవాఖానను మంజూరు చేశారు. ఈ దవాఖానకు సీఎం కేసీఆర్ జూన్ 22న శంకుస్థాపన చేశారు. ఆయా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు జీవో రావడంతో పటాన్చెరు రెవెన్యూ డివిజన్ పనులు చకచకా జరుగుతాయి. ప్రజలకు సంగారెడ్డి వెళ్లే పని తప్పుతుంది. పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల, అమీన్ఫూర్, రామచంద్రాపురం మండలాల రెవెన్యూ సమస్యలు తక్షణం పరిష్కారం అవుతాయి. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తామని ఆ దిశగా పనిచేస్తున్న ఎమ్మెల్యే జూనియర్ కళాశాలలతో పాటు డిగ్రీ కళాశాలను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు పీజీ ఉన్నత చదువు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లభ్యమవుతున్నది. టెక్నికల్ విద్యకు పాలిటెక్నిక్ కళాశాల అవసరమని గుర్తించి సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే అడిగారు. ఎమ్మెల్యే కోరిక మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పటాన్చెరుకు మంజూరు కావడంతో యువతరానికి సాంకేతిక విద్య అందుబాటులోకి రానున్నది. ఉస్మాన్నగర్లో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే కోరారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ స్పందించి ఆశాఖకు ఆదేశాలివవ్వడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
పటాన్చెరు అంటేనే మినీ ఇండియా దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కచ్చితంగా అందరికీ అందేలా చూస్తున్నాం. ఇప్పుడు పటాన్చెరు అభివృద్ధిలో ముందున్నది. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పటాన్చెరుకు రెవెన్యూ డివిజన్ వచ్చింది. పాలిటెక్నిక్ కళాశాలకు అనుమతులు వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరైంది. మియాపూర్ నుంచి ఇస్నాపూర్కు మెట్రోకు క్యాబినెట్ ఆమోదం పొందింది. కార్యాచరణ ప్రారంభమైంది. ఉస్మాన్నగర్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేసి ఐటీ పురోగతికి సీఎం సహకరిస్తున్నారు. మేం కోరినవే కాకుండా కోరనివి కూడా సీఎం కేసీఆర్ ఇవ్వడం మా అదృష్టం. ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు.
– గూడెం మహిపాల్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే
మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు వేయాలని, పరిశ్రమలు అధికంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ దృష్టికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి తీసుకువెళ్లారు. స్పందించిన సీఎం ఇస్నాపూర్ వరకు మెట్రోను పొడిగిస్తూ నేరుగా రాష్ట్ర కేబినెట్ ద్వారానే ఆమోదం చేయించారు. దీంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందనున్నది. పైగా ఔటర్ రింగురోడ్డు చుట్టూ మెట్రో రైలు ప్రతిపాదన ఉండడంతో జిల్లాకు అత్యధునిక మెట్రో రైలు సేవలు అందబోతున్నాయి. కొత్తగా మంజూరైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రాకతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చినట్టుగా అవుతున్నది. పటాన్చెరుకు హెచ్ఎండీఏ డివిజన్ కార్యాలయం తీసుకుని వచ్చేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. మున్సిఫ్ కోర్టు త్వరలో రాబోతున్నది. ఈఎస్ఐ, పీఎఫ్ కార్యాలయాలు పటాన్చెరులో ఉన్నాయి. టీఎస్ఐఐసీ జోన ల్ కార్యాలయం పటాన్చెరులోనే ఉన్నది. పరిశ్రమల ఖిల్లాకు అది పెద్ద ప్లస్పాయింట్. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయం అందుబాటులో ఉంది. కార్మికశాఖ కార్యాలయం అశోక్నగర్లో ఉంది. కార్మికులకు ఈ శాఖలు సేవలను అందజేస్తున్నాయి. ఈఎస్ఐ దవాఖానలతో కార్మికులకు వైద్య సౌకర్యం లభిస్తున్నది. అన్ని గ్రామాలకు రోడ్లు వేయడంతో కనెక్టివిటీ పెరిగింది. ప్రభుత్వం పలు కార్యాలయాలు పటాన్చెరులో ఏర్పాటు చేయడం అందరికీ ఉపయోగకరంగా మారాయి.