పటాన్చెరు, మార్చి 20 : తడి, పొడి చెత్త వేర్వేరుగా బకెట్లలో పెట్టి పంచాయతీల చెత్తబండిలో వేయాలని ఉదయం మైకుల్లో అరిచి సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను విడదీయని పక్షంలో చెత్తబండి నిర్వాహకులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చెత్త సేకరణ బాగానే జరుగుతున్నా, సేకరించిన చెత్తను పంచాయతీలు ఏమి చేస్తున్నాయని పరిశీలిస్తే పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికుల గుండెలు ఝళ్ల్లుంటాయి. తడి,పొడి పేరున సేకరించిన చెత్తను ఒకచోట చేర్చి నిప్పు పెట్టేస్తున్నారు. చెత్తతో సంపద సృష్టి, చెత్త రీసైక్లింగ్ అనే ముచ్చట్లు నినాదాలుగానే మారుతున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీలు ఇప్పుడు మున్సిపాలిటీల స్థాయి జనాభాతో నిండిపోయాయి. అదేస్థాయిలో రోజూ టన్నులకొద్దీ చెత్త పోగవుతున్నది. ఈ చెత్తను నేరుగా డంపింగ్ యార్డుల పరిధిలోని ఖాళీ జాగాల్లో వేసి తగులబెడుతున్నారు. చెత్త తగలబెట్టడాన్ని కేంద్ర సర్కార్, కోర్టులు సైతం నిషేధించాయి. కానీ, ఇవేవి పట్టని అధికారులు పోగైన చెత్త కుప్పలకు నిప్పుపెట్టి బూడిద చేస్తున్నారు. దీంతో పర్యావరణ కాలుష్యం చోటుచేసుకుంటున్నది. ఒకప్పుడు ఆదర్శంగా కనిపించిన డంపింగ్యార్డులు ఇప్పుడు నిర్వహణ కరువై కంపుకొడుతున్నాయి. వానపాములను ఉపయోగించి సేంద్రియ ఎరువులు తయారుచేసే ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం రాగానే అధికారులు పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన రావడంతో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అధ్వానంగా మారిందని ప్రజలు చెబుతున్నారు.
ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 50వేలకు మించి జనం నివసిస్తున్నారు. తడి,పొడి చెత్తను సేకరిస్తున్న పంచాయతీ సిబ్బంది నేరుగా రోడ్ల పక్కన డంప్ చేస్తున్నారు. డంపింగ్ యార్డు వెనుకభాగంలో చెత్తను తగులబెడుతున్నారు. మార్కెట్లో, గృహాల నుంచి, పరిశ్రమల వ్యర్థాలను తీసుకొచ్చి నేరుగా డంప్యార్డు కంపౌండ్లో వేసి తగులబెడుతున్నారు. దీంతో నందిగామ రోడ్డు, ఇందిరమ్మ కాలనీలో దట్టమైన పొగలు వ్యాప్తి చెందుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, దవాఖాన వ్యర్థాలను సైతం అగ్గికి ఆహుతి చేస్తుండడంతో విషవాయులు వ్యాప్తి చెందుతున్నాయి. ముత్తంగిలోనూ సుచీరిండియా గుంతల్లో చెత్తను వేసి తగులబెడుతున్నారు. చిట్కుల్లో నక్కవాగు గట్టున పోగైన చెత్తను తగులబెడుతున్నారు. భానూర్లో డంప్యార్డు వెనుకభాగంలో చెత్తను తగులబెడుతున్నారు. తద్వారా వాయు కాలుష్యం చోటుచేసుకుంటున్నది.
పటాన్చెరు మండలంలోని అన్ని గ్రామాల్లో డంప్యార్డులను తనిఖీ చేస్తాం. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను పరిశీలిస్తాం. పోగవుతున్న చెత్తను పునర్వినియోగం చేసుకునేలా ఆదేశాలు ఇస్తాం. చెత్తను తగుల బెట్టడం తప్పు. నిబంధనల మేరకు చెత్త సేకరణ చేయాలి. చెత్తను సహజ ఎరువులుగా తయారు చేసుకోవాలి. ఇలా చేయని పంచాయతీలపై చర్యలు తీసుకుంటాం.