మెదక్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): నెర్రలు చాచిన ఆ నేలల్లో పచ్చదనం పురివిప్పుకుంటున్నది. ఎటుచూసినా పచ్చని పంటలతో మెతుకు సీమ పచ్చగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రతి గుంటకూ నీళ్లందిస్తున్నారు. జిల్లాలో చెక్డ్యాంలు నిర్మించడంతో వాటి కింద ఉన్న భూములు పంటలతో కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది.
వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఎకరా రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలు ఇస్తున్నది. మెదక్ జిల్లాలో యాసంగిలో 2 లక్షల 32 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారుగా 5 లక్షల 10వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేశారు అధికారులు. ఇందు లో 4లక్షల 42వేల మెట్రిక్ టన్నులు ఏప్రిల్ మూడో వారం నుంచి ప్రారంభంకానున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని వారు చెబుతున్నారు.
413 కొనుగోలు కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 110, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 295, డీసీఎంఎస్ 5, ఎఫ్పీవో ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ కేంద్రాల్లో ధాన్యాన్ని అరబెట్టేందుకు టార్ఫాలిన్లు సరఫరా చేస్తున్నారు. కేంద్రాల్లోని సిబ్బంది ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్లలో నమోదు చేస్తారు. దీంతో రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమ అవుతుంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో లారీలు ఏర్పాటు చేస్తున్నారు. లారీల్లోని ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లుల్లో అన్ లోడింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
నెలాఖరు నుంచి ధాన్యం కొనుగోలు
సంగారెడ్డి, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో యాసంగిలో పండిన ధాన్యాన్ని ఈ నెలాఖరు నుంచి కొనుగోలు చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. యాసంగి సీజన్లో 1,00,126 ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ఎక్కువగా వరి పండించారు. సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల కింద పుల్కల్, అందోలు, చౌటకూరు మండలాల్లోని రైతులు మరీ ఎక్కువగా వరి సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,00,126 ఎకరాల్లో వరి సాగు కావడంతో 2,30,280 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతులుల అవసరాలు పోగా 2.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యంత్రాంగం సేకరించనున్నది.
209 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
గత ఏడాది యాసంగిలో 180 కొనుగోలు కేంద్రాల ద్వారా 73,718 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం సేకరించింది. ఈ యాసంగిలో 2.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 209 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 22, ఐకేపీ ఆధ్వర్యంలో 101, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 86 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో రైతులకు అవసరమైన టార్పాలిన్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు.
వేసవి నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. ధాన్యం సేకరణకు 51.75 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కానున్నాయి. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద 39.28 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగతా 12.47 లక్షల గన్నీ బ్యాగులను సేకరించనున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం వరకు పూర్తిస్థాయిలో గన్నీ బ్యాగులను సమకూర్చుకోనున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 76 రైస్ మిల్లులున్నాయి. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లులకు చేరుకునేలా అధికారులు ట్రాన్స్పోర్టు ఏర్పాటు చేస్తున్నారు. కూలీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
గ్రేడ్ వన్కు రూ.2060, సాధారణ రకం రూ.2040
ధాన్యం గ్రేడ్ వన్కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ధరను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తరలించనున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తొందరగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉండవు
జిల్లావ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. యాసంగిలో 4 లక్షల 42వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల మూడో వారంలో ధాన్యం కేంద్రాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లను సవ్యంగా పూర్తి చేస్తాం.
– జి.రమేశ్, జిల్లా అదనపు కలెక్టర్, మెదక్