‘మనఊరు-మనబడి’తో సర్కారు బడులు నూతన శోభను సంతరించుకుంటున్నాయి. మెదక్ జిల్లాలో 898 పాఠశాలలుండగా, మొదటి విడుతలో 313 ఎంపికచేశారు. 240 చోట్ల పనులు ప్రారంభించి దాదాపు 50శాతం పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో 1262 స్కూళ్లలో 441 సెలక్ట్ చేయగా, 40శాతం పూర్తయ్యాయి. మూడేండ్లు మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. శిథిలావస్థ భవనాలకు మరమ్మతులు, కొత్త ఫర్నిచర్, ల్యాబ్లు, మరుగుదొడ్లు, కిచెన్ల నిర్మాణం, తాగునీటి వసతి, తదితర 12 రకాల సదుపాయాలు కల్పిస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఫస్ట్ఫేజ్ను విజయవంతంగా పూర్తి చేసేందుకు రెండు జిల్లాల కలెక్టర్లు హరీశ్, శరత్లు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ బడులు బలోపేతమవుతుండడంతో వచ్చే ఏడాది అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖాధికారులు భావిస్తున్నారు.
మెదక్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రంగులతో కళకళలాడుతున్న ఈ భవనం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో ఉన్న ప్రైమరీ పాఠశాల. మనఊరు-మనబడి కార్యక్రమం కింద ప్రభుత్వం ఈ పాఠశాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నది. ఈ పాఠశాలకు రూ.5 లక్షల 93వేల నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో విద్యుద్ధీకరణకు రూ.2 లక్షల 8వేలు కాగా, తాగునీటి సరఫరాకు రూ.లక్షా 23వేలు, మేజర్, మైనర్ రిపేర్లకు రూ.2 లక్షల 61వేల నిధులు మంజూరు చేశారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం అజ్జమర్రి ప్రైమరీ పాఠశాల. ఈ పాఠశాలకు కూడా ప్రత్యేకంగా రూ.11 లక్షల 75వేల నిధులు కేటాయించారు. ఇందులో విద్యుద్ధీకరణకు రూ.లక్షా 66వేలు కాగా, తాగునీటి సరఫరాకు రూ.లక్షా 17వేలు, మేజర్, మైనర్ మరమ్మతులకు రూ.8 లక్షల 91వేలు కేటాయించారు. ఈ రెండు స్కూళ్లే కాదు.. మెదక్ జిల్లాలోని ప్రభుత్వ బడులన్నింటి రూపుమార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’తో శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా 898 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 313 పాఠశాలల్లో 44 ప్రాథమిక పాఠశాలలు, 180 ప్రాథమికోన్నత పాఠశాలలు, 89 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 240 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. పాఠశాలల్లో పాడుబడిన భవనాలు, శిథిలావస్థకు చేరిన బెంచీలు, కుర్చీలు, జాడలేని ల్యాబ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతికి కరువు ఉండే పరిస్థితులకు ఇక చెక్ పెట్టనున్నారు. దశలవారీగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే వందలాది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైంది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. పక్కా భవనాలు, ప్రహరీలు, మరుగుదొడ్లు, వంటగది, భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, ల్యాబ్లు ఇలా 12 రకాల సదుపాయాలను కల్పించేలా చర్యలు చేపట్టింది. మనఊరు-మనబడి కింద మెదక్ జిల్లాలో 313 పాఠశాలల్లో రూ.5 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. మూడు దశల్లో మూడేండ్ల పాటు విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మొదటి దశలో ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ పాఠశాలలో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్ధీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్ధులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్ అందించడం, పాఠశాలలు మొత్తం నవీకరించడం, మరమ్మతులు చేయడం, కిచెన్లు ఏర్పాటు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్యవంటి వాటిని అమలు చేయనున్నారు. అయితే ఎంపిక చేసిన పాఠశాలలో పనుల బాధ్యతలను జిల్లా కలెక్టర్కు అప్పగించారు. అంతేకాకుండా ప్రభుత్వం పూర్వ విద్యార్థులను కూడా తమ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నది.
సంగారెడ్డి, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నది. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో తొలి విడతగా 441 ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఇందుకోసం రూ.162 కోట్లను ఖర్చు చేస్తున్నది. ఆయా పాఠశాలల్లో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్ధీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్ధులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్ అందించడం, పాఠశాలలు మొత్తం నవీకరించడం, మరమ్మతులు చేయడం, కిచెన్లు ఏర్పాటు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్యవంటి వాటిని అమలు చేయనున్నారు. విద్యాశాఖ అధికారుల సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలో ‘మనఊరు-మనబడి’ తొలిదశకు సంబంధించిన 40 శాతంకుపైగా పనులు పూర్తయ్యాయి. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు కలెక్టర్ శరత్ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 1262 పాఠశాలలు ఉండగా, మొదటి దశ మనఊరు-మనబడి ద్వారా 441 పాఠశాలల్లో 256 ప్రాథమిక, 64 ప్రాథమికోన్నత, 124 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనులు చేపడుతున్నారు. ఎంపికైన పాఠశాలల్లో మొత్తం 80,757 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 331 పాఠశాలల్లో రూ.30లక్షల లోపు నిధులతో పనులు చేపట్టగా, 104 పాఠశాలల్లో రూ.30 లక్షలకుపైగా నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖకు 328 పాఠశాలల నిర్మాణం పనులు చేపడుతుంది. పబ్లిక్ హెల్త్ విభాగానికి ఎనిమిది పాఠశాలలు, ఇరిగేషన్ శాఖ 18 పాఠశాలలు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ పర్యవేక్షణలో 87 పాఠశాలల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ అధికారుల సమాచారం మేరకు ఇప్పటి వరకు 45 పాఠశాలల్లో నిర్మాణం పనులు పూర్తయ్యాయి. మిగితా పాఠశాలల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఎంపిక చేసిన 441 పాఠశాలల్లో పనులు పూర్తయి పాఠశాలలు కొత్త కళను సంతరించుకుంటాయని అధికారులు చెబుతున్నారు.