మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 29: పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తున్నది. పాల దిగుబడి పెంచేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు పాల ధరను పెంచుతున్నట్లు ఆగష్టు 29న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా గతంలో పాడి రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం
పాడి రైతులను ఆదుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆవులు, బర్రెలు పంపిణీ చేయడంతో పాటు విజయ డెయిరీకి పాలు విక్రయించే వారికి పలు ప్రోత్సాహకాలు అందజేస్తున్నది.
3 వేల మంది పాడి రైతులకు లబ్ధి
పెంచిన పాల ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. లీటర్కు గేదె పాలు రూ. 2.70, ఆవు పాలకు రూ.5 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా విజయ డెయిరీ పరిధిలో సుమారు 3 వేల మంది పాడి రైతులు ఉన్నారు. ప్రతి రోజూ 3 వేల లీటర్లకు పైగా పాలు సేకరిస్తున్నారు. పాల ధరను పెంచడంతో జిల్లాలోని పాడి రైతులకు లబ్ధి చేకూరనున్నది.
విజయ డెయిరీకి జిల్లాలో మెదక్ పాల శీతలీకరణ కేంద్రంతో పాటు రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, కౌడిపల్లి, చేగుంటలో బల్క్మిల్స్ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటితో పాటు 21 మండలాల పరిధిలో 155 పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో రోజూ మూడు వేల లీటర్లకు పైగా పాల సేకరణ జరుగుతున్నది. ప్రతి ఏడాది జులై, ఆగస్టు నెలలో పాల ఉత్పత్తి తగ్గి అక్టోబర్ నుంచి పాల ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. గేదెలు, ఆవులు ఎక్కువగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలోనే ఈనుతుంటాయి. పాల వెన్న శాతం(ఫ్యాట్), పోషక పదార్థాల శాతం(ఎస్ఎస్ఎఫ్) బట్టి రైతులకు బిల్లుల చెల్లింపులు ఉంటాయి.
ఒక లీటర్ పాలలో 6 శాతం వెన్న ఉన్నట్లు యావరేజ్గా తీసుకుంటే ప్రస్తుతం రూ. 41.40 పైసలు విజయ డెయిరీ చెల్లిస్తుంది. గేదె పాలకు లీటర్ పాలకు యావరేజ్గా రూ.2.70 పెరగడంతో ఇక నుంచి రూ.43.80 పైసలు చెల్లిస్తారు. లీటర్ పాలలో వెన్న శాతం 10 ఉంటే ఇప్పటి వరకు రూ. 69 చెల్లిస్తుండగా తాజాగా పెరిగన ధరతో రూ.73 చెల్లిస్తారు. ఆవు పాలు ఒక లీటర్లో 4 శాతం వెన్న ఉంటే రూ. 33.75 పైసలు చెల్లిస్తారు. తాజాగా లీటర్పై రూ.5 పెంచడంతో రూ.38.70 పైసలు చెల్లిస్తారు. ధర పెంచడంతో పాల సేకరణ మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రతి నెలా పాడి రైతులకు సుమారు రూ. 15 లక్షల 50 వేలకు పైగా బిల్లులు విజయ డెయిరీ చెల్లిస్తుంది.
ఇప్పటికే అందిస్తున్న పథకాలు..
– విజయ విద్యాకానుక పథకం..
పాడి రైతు కుటుంబంలో విద్యార్థి పదో తరగతిలో 9 జీపీఏ సాధిస్తే రూ. వెయ్యి, ఎంసెట్లో 10 వేల లోపు ర్యాంక్ సాధిస్తే రూ. 2 వేలు, ఐఐటీ, జేఈఈలో సీటు సాధిస్తే రూ.2 వేలు, అఖిల భారత సర్వీసు సాధించిన వారికి రూ.10వేల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసా పత్రం అందిస్తారు.
సంక్షేమ పథకాలు
డెయిరీతో ప్రయోజనాలు..
డెయిరీలో పాలు పోసే రైతులకు అనేక ప్రయోజనాలన్నాయి. పాడి రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం ధర పెంచింది. ప్రైవేట్ డెయిరీల కంటే ఎక్కువ ధర విజయ డెయిరీ చెల్లిస్తున్నది. రైతులకు ప్రోత్సాహకాలతో పాటు పాలు, ఉత్పత్తుల అమ్మకాల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నది. 400లీటర్ల వరకు పాలు అమ్మకాలు జరిగే ప్రాంతాల్లో చిన్నతరహా పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది.
– రజిత, మెదక్ పాలశీతలీకరణ మేనేజర్