పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలుచేస్తున్నారని, వాటిని ప్రజలకు వివరించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. కల్హేర్ మండలం మాసాన్పల్లిలోని వెంకటాద్రి ఫంక్షన్హాలులో శనివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలు కొనుగోలు చేశామన్నారు. ఇంటింటికీ నల్లా బిగించి తాగునీటిని అందిస్తున్నామని, మారుమూల తండాలకూ సీసీ రోడ్లు వేశామని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. యాభై ఏండ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ చేసిందేమీలేదని, ఇప్పుడున్న బీజేపీ ఈడీ, సీబీఐ దాడులంటూ దుర్మార్గమైన పాలన చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. – కల్హేర్, మార్చి 25
కల్హేర్, మార్చి 25: రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు అనేక సంక్షేమ పథకాలున్నాయని, తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం కల్హేర్ మండలంలోని మాసాన్పల్లి గ్రామ శివారులో వెంకటాద్రి ఫంక్షన్ హాలులో ఆత్మ కమిటీ చైర్మన్, పార్టీ మండల అధ్యక్షుడు రాంసింగ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పరిపాలనలో పేదల సంక్షేమానికి విప్లవాత్మకమైన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
ప్రజల్లోకి వెళ్లి తలదించుకోకుండా, ధైర్యంగా తొడగొట్టి పథకాలను వివరించి చెప్పాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. 50 ఏండ్లు కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం ప్రాంత అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. చెరువుల మరమ్మతుల నిధులు కూడా అప్పటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కాజేశారన్నారు. ఇందిరమ్మ ఇండ్లను బినామీల పేర్లతో మంజూరు చేయించుకున్నారని, గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు, ఉపాధి హామీ బిల్లులను పందికొక్కుల్లా మెక్కారన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అంటే నియోజకవర్గంలో కొందరికే తెలిసేదని, బీఆర్ఎస్ పాలనలో పేద వర్గాలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాల్లో 80 నుంచి 100 శాతం వరకు సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగాయన్నారు. పంటను కొనేందుకు గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం కొంటూ రైతులకు అండగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారన్నారు.
మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ నల్లా బిగించి స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నామన్నారు. త్వరలోనే పంచాయతీలకు నిధులు మంజూరవుతాయన్నారు. నల్లవాగు చరిత్రలో బీఆర్ఎస్ పాలనలో యాసంగి సాగు జరిగిందన్నారు. సింగూర్ నుంచి వాగులోకి నీటిని మళ్లించడంతో నల్లవాగు ఏడాది పొడుగునా నిండుకుండలా మారిందన్నారు. రైతు బీమా కింద రైతు మృతి చెందితే సీఎం కేసీఆర్ రూ.5 లక్షలు అందజేస్తున్నారన్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏ నిధులు, అభివృద్ధి పనులు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నర్సింహరెడ్డి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పీ, మండల కో ఆప్షన్ల సభ్యులు అలీ, ఘనీ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవీందర్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నారాయణరావు, బీబీపేట్ పీఏసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, మార్డి పీఏసీఎస్ మాజీ చైర్మన్ జలందర్, పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సంతోశ్కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.