సిద్దిపేట,మే12 : కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించినా కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి విజయవంతంగా ధాన్యం కొన్నామని, రైతులకు రైతుబంధు ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం బండచర్లపల్లిలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. 15 రోజులైనా లారీలు రావడం లేదని రైతుల చెప్పగా, వెంటనే ఆర్డీవోతో హరీశ్రావు ఫోన్లో మాట్లాడారు. లారీలను పంపించి ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలని కోరారు. ఈ సందర్భంగా విలేకరులతో హరీశ్రావు మాట్లాడుతూ.. సకాలంలో మిల్లర్లు ధాన్యం దిం చుకోకపోవడం, అధికారులు పట్టించుకోక పోవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించడంలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందన్నారు.
వడ్ల కొనుగోలులో సీఎం, మంత్రులకు పట్టక, అధికారులు పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మార్చి 22న సిద్దిపేటకు రేవంత్రెడ్డి వచ్చినప్పుడు ఒక ఎకరాకు వేశారని, 45 రోజుల్లో రైతుబంధు డబ్బులు పూర్తి గా చేవేస్తామని చెప్పి 52 రోజులు దాటినా వేయడం లేదని హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయని అన్నారు. బుస్సాపూర్కు చెందిన రైతు యాదయ్య మక్కలు విక్రయించడానికి తెస్తే, గన్నీ బ్యాగులు ఇవ్వకుండా 20 రోజులు కాంటా చేయలేదన్నారు. తీరా ఆ రైతుల బయట సంచులు కొనుక్కోని తెస్తే కాంటా పెట్టారని, ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని హరీశ్రావు విమర్శించారు. సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ది అని హరీశ్రావు మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని హరీశ్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డికి రైతులపై ప్రేమ లేదన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. కరోనా సమయంలోనూ రైతుబందు ఆపలేదని, కరోనా టైంలో ధాన్యం కొనుగోలుకు హమాలీలు దొరక్కపోతే బీహారు ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి హమాలీలను తెచ్చి కాంటాలు పెట్టినట్లు గుర్తుచేశారు.
వెంటనే సన్ఫ్లవర్ కొనుగోళ్లు ప్రారంభించాలి
ప్రభుత్వం వెంటనే సన్ఫ్ల్లవర్ను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. మొక్కజొన్న, శనగల కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. ఇప్పటికైనా సీఎం, మం త్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని హరీశ్రావు సూ చించారు. ఇప్పటి వరకు కొన్న మొక్కజొన్న,సన్ఫ్ల్లవర్, శనగల రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమచేయాలన్నారు. ధాన్యం తరలింపులో జాప్యాన్ని పరిష్కరించాలని సూచించారు. ఆర్టీఏ, రెవెన్యూ, పోలీసులను సమన్వయం చేసి లారీలు తీసుకువచ్చి ధాన్యం తరలించాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో తాను మంత్రిగా కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో సందర్శించానని, ఆర్డ్టీఏ, రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులను సమన్వయ పరి చి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూశామని, ఎక్కడా సమస్య రాకుం డా చేశామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్ర యాదయ్య, సర్పంచ్ నాగరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు సంపత్రెడ్డి, ప్రభాకర్వర్మ, పోచబోయిన శ్రీహరి యాదవ్, కిషన్రెడ్డి సోమిరెడ్డి,ఎల్లారెడ్డి, రెడ్డి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.