హుస్నాబాద్/అక్కన్నపేట, జూలై 31 : దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మెట్ట ప్రాంత ప్రజల కల నెరవేరిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. ‘ఎన్నో ఏండ్లుగా గోదావరి నీళ్లు వస్తాయి.. మా పంటపొలాలకు సాగు నీరందుతుంది..’ పం టలు పుష్కలంగా పండుతాయని, ఎన్నో ఆశలతో ఉన్న ప్రజలకు ఇది శుభవార్త’ అని అన్నారు. ఆదివారం అక్కన్నపేట మం డలం రేగొండ గ్రామ శివారులోని గౌరవెల్లి రిజర్వాయర్ సమీపంలో నిర్మాణమైన పంపుహౌస్లో మోటర్లను ప్రారంభించి ట్రయల్న్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, మంత్రుల కృషితో రిజర్వాయర్ పూర్తయిందన్నారు. 2014వరకు రిజర్వాయర్ను పాలకులు నిర్లక్ష్యం చేశారని, సీఎం కేసీఆర్ స్వయంగా సందర్శించి సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచారన్నారు. దీంతో నియోజకవర్గంలోని లక్షా 6వేల ఎకరాలకు సాగునీరందనుందన్నారు. 126మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే భారీ పంపులను బిగించారని, వీటి ద్వారా నిరంతరం నీటిని రిజర్వాయర్లోకి ఎత్తిపోయనున్నట్లు చెప్పారు.
జపనీస్ టెక్నాలజీ కలిగి ఉన్న ఈ మోటర్లను చైనా నుంచి తెప్పించినట్లు తెలిపారు. ఒకప్పుడు వరద కాల్వ అనేవారని, కానీ సీఎం కేసీఆర్ కృషితో ఇప్పుడు జీవ కాల్వ అయ్యిందన్నారు. సంవత్సరం పొడవునా రిజర్వాయర్లో నీళ్లుంటాయన్నారు. కుర్చీ వేసుకొని కూర్చుండి రిజర్వాయర్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ వందశాతం నెరవేర్చారన్నారు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని విజయవంతంగా ట్రయల్ రన్ చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు కూడా వస్తున్నాయని, మిగతా ఐదు శాతం కట్ట పనులు పూర్తి చేసి రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపుతామనే ధీమా వ్యక్తం చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్కు గోదారమ్మ నీటిని మళ్లించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. టన్నెల్, పంపుహౌస్ నిర్మాణం, మోటర్ల బిగింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఇంజినీర్లను అభినందించారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర యూత్ నాయకులు వొడితెల ఇంద్రనీల్బాబు, వొడితెల ప్రణవ్బాబుతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.