గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 3: ‘ఎనకటి రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయ్.. ఎండలు మండుతుండగా గోదావరి నీళ్లను కూడవెల్లి వాగులో మూడేండ్లుగా చూస్తున్నం. మొదట్లో మల్లన్నసాగర్ కోసం భూములు తీసుకుంటుంటే మనం చూస్తామా ఈ ప్రాజెక్టును ఎన్ని ఏండ్లు అయితాదో కట్టడానికి అనుకున్నం. కానీ తొందరగానే ప్రాజెక్టు కట్టి కాలువల ద్వారా నీళ్లను ఇస్తూ వాగును గోదావరి నీళ్లతో నింపుతుండు కేసీఆర్’… అంటూ దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని బలవంతపూర్కు చెందిన రైతులు సత్తయ్య, రాజమల్లయ్య శక్రవారం గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ కాలువ ద్వారా కూడవెల్లి వాగులోకి నీటి విడుదల చేస్తుండగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఎండకాలంలో వరి పండించాలంటే కరెంట్ తిప్పలు, బోర్లలో నీళ్లురాక ఎన్నో తిప్పలుండేవి. కరెంట్ రాత్రి ఎప్పుడు వస్తందో తెలియకపోతుండే. బోర్ల కాడనేరాతిర పడుకునేవాళ్లం. ఇప్పుడు కరెంట్ బాధలు పోయినయ్. పుష్కలంగా ఎనకట చూసినట్లు నీళ్లను కళ్ల ముందు వాగులో చూస్తున్నం. ఎండకాలంలో వరి పండించడంలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక రైతులకు రైతుబంధు, చనిపోతే రూ.5 లక్షల రైతుబీమా ఇస్తుండు. వానలు పడకముందే ఎరువులు, విత్తనాలు దుకణాల్లో దొరుకుతున్నయి. ఎరువులు, విత్తనాల కోసం కాంగ్రెస్ గవర్నమెంట్లో పొద్దుగాళ్లనే పొయి లైన్లలో నిలబడితే యూరియా దొరికేది అంటూ మాట్లాడుకున్నారు.