నర్సాపూర్ , ఏప్రిల్ 22: బీజేపీ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై గ్లోబల్ ప్రచారం చేస్తూ చిల్లర రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. సోమవారం నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు మొదలైందని, రైతుల్లో, కార్మికుల్లో, ఉద్యోగుల్లో కాంగ్రెస్ట్పై వ్యతిరేకత ఉందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఓటేయ్యాలని, భూకబ్జాలకు పాల్పడ్డది ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై దుష్పచారం చేస్తుందని, దీనిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు మంచి చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవాడని దుబ్బాకను అభివృద్ధి చేయకనే ప్రజలు బుద్ధి చెప్పారని వెల్లడించారు. నియోజకవర్గంలో హల్దీ వాగులోకి నీరు ఎక్కడి నుంటి వస్తుందో గ్రహించాలని, కేసీఆర్, వెంకట్రామిరెడ్డి కృషి వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.
చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోయాయని మెదక్లో మాత్రం ఎండిన పంటల శాతం తక్కువగానే ఉందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బీఆర్ఎస్ హ యాంలో తెలంగాణ వడ్లను కొనలేదు, నేడు ఏ మొఖం పెట్టుకొని నామినేషన్ కార్యక్రమానికి వస్తున్నాడని మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, మా జీ ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, సత్యంగౌడ్, సింగాయిపల్లి గోపి, సంతోష్రెడ్డి పాల్గొన్నారు.