గజ్వేల్, డిసెంబర్ 9: గజ్వేల్ సమీకృత మార్కెట్కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్ ప్రజలకు అద్భుతమైన సేవలందించడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికా తరహాలో అన్ని ఒకే ప్రాంగణంలో లభించే రీతిలో సీఎం కేసీఆర్ ఈసమీకృత మార్కెట్కు శ్రీకారం చుట్టారు. నిర్మాణానికి తగ్గట్టుగానే నిర్వహణలో రాజీపడకుండా పరిశుభ్రత, వ్యాపారులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు జాతీయస్థాయి ప్రమాణాలు గల మార్కెట్గా గుర్తింపు సాధించింది.
గజ్వేల్ పట్టణంలో గతంలో రోడ్లకు ఇరుపక్కలా ధుమ్ము, ధూళి మధ్య వ్యాపారులు, చిన్న రైతులు తాము పండించిన కూరగాయలు, అలాగే వ్యాపారులు మాంసాన్ని విక్రయించేవారు. అయితే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధిలో భాగంగా సీఎం కేసీఆర్ గజ్వేల్లో రూ.22.85కోట్లతో ఆరు
ఎకరాల 24గుంటల స్థలంలో నిర్మించిన గజ్వేల్ సమీకృత మార్కెట్ను ఆయనే స్వయంగా 2019డిసెంబర్ 11న ప్రారంభించారు. ఈ మార్కెట్లో వ్యాపారుల కోసం మొత్తం ఆరు విభాగాలుగా ఏర్పాటు చేస్తూ 242 స్టాళ్లను నిర్మించారు.
ఆరు బ్లాక్లలో 3 బ్లాక్లు కూరగాయల కోసం 2 బ్లాక్లు పూలు, పండ్ల కోసం, 1 బ్లాక్లో మటన్, చికెన్, చేపల విక్రయాలకు కేటాయించారు.6 వేల నుంచి 7500 మంది వరకు మార్కెట్లో కూరగాయలు, మాంసం, పండ్లు, పూలు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం కూరగాయలకు కేటాయించిన 107స్టాళ్లలో 54 స్టాళ్లలో మాత్రమే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. 75 క్వింటాళ్ల కూరగాయల అమ్మకాలు సాగుతుండగా, నిత్యం రూ.1.15లక్షల వ్యాపారం జరుగుతున్నది. 65 పండ్ల స్టాళ్లలో 25 స్టాల్స్లో మాత్రమే వ్యాపారాలు కొనసాగుతుండగా, వారానికి 2200 క్వింటాళ్ల పండ్ల అమ్మకాలు జరుగుతుండగా, రూ.3లక్షల వ్యాపారం కొనసాగుతున్నది.
18స్టాళ్లు పూల వ్యాపారానికి కేటాయించగా, 12స్టాళ్లలో రోజుకు 400 కిలోల పూలు విక్రయించగా రూ.1.70లక్షల వ్యాపారం జరుగుతున్నది. ప్రతి ఆదివారం 52స్టాళ్లలో 400 కిలోల మాంసాహారం అమ్ముతుండగా రూ. 6లక్షల వ్యాపారం జరుగుతున్నది. ప్రజలకు కిరాణా వస్తువులు కూడా మార్కెట్లోనే కొనుగోలు చేసేవిధంగా 16 వాణిజ్య దుకాణాలు, సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి మార్కెట్కు వస్తే అవసరమైన అన్ని వస్తువులు లభించే విధంగా సమీకృత మార్కెట్ను సీఎం కేసీఆర్ నిర్మించారు. సమీకృత మార్కెట్ ఏర్పాటు నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోనే దీని నిర్వహణ కొనసాగుతున్నది. ఎల్లప్పుడు పరిశుభ్రంగా, అహ్లాదంగా కనబడేలా నిర్వహించడం వల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ ధ్రువీకరణ లభించింది.
మరిన్ని సౌకర్యాలతో..
సమీకృత మార్కెట్లో మరిన్ని సౌకర్యాలు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎల్లవేళలా ప్రజలకు సమయాన్ని గుర్తు చేసేవిధంగా పైన క్లాక్ టవర్ ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల సన్నకారు రైతులు తాము పండించిన కూరగాయలను విక్రయించుకోవడానికి కూడా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలందరికీ మినరల్ వాటర్ సదుపాయం, భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మార్కెట్కు వచ్చిన వారంతా సేద తీరడానికి, ఆహ్లాదంగా ఉండడానికి గడ్డితో పార్కులా తీర్చిదిద్దారు. చిన్నారులు ఆడుకోవడానికి అవసరమైన ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేవిధంగా రకరకాల శిల్పాలు రూపొందించారు.
వాహన పార్కింగ్ కోసం విశాలమైన పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు
కూడా అనువుగా ఏర్పాటు చేశారు. ఈ సమీకృత మార్కెట్ను మిజోరం, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర
ప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ రిటైర్డ్ అధికారులు
సందర్శించారు.
అందుబాటులో కోల్డ్ స్టోరేజీ సౌకర్యం
గతంలో కూరగాయలు మిగిలిపోయి పాడైపోయేవి. సమీకృత మార్కెట్లో రైతులకు సౌకర్యార్థం కోల్డ్
స్టోరేజీని ఏర్పాటు చేశారు. ఈ కోల్డ్స్టోరేజీలో వ్యాపారులు తమ కూరగాయలను తక్కువ ధరకు భద్రపర్చుకునే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల వరకు వ్యాపారులు తమ కూరగాయలను భద్రపర్చుకుని విక్రయించుకోవడానికి కోల్డ్ స్టోరేజీ ఎంతో ఉపయోగపడుతుంది.
మోడల్గా గజ్వేల్ సమీకృత మార్కెట్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి గజ్వేల్ పట్టణంలోని వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్ మోడల్గా నిలుస్తుంది. ఒకప్పుడు ధుమ్ము, ధూళి నిండిన రోడ్లపై కూరగాయలు విక్రయించిన వ్యాపారులు, ఇప్పుడు కాలుష్యానికి దూరంగా, పరిశుభ్రమైన వాతావరణంలో అన్ని వసతులతో కూడిన సమీకృత మార్కెట్లో వ్యాపారాలు నిర్వహించడం అభివృద్ధికి తార్కాణం.
అమెరికా తరహాలో రైతులు, వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేశాం. ప్రజలకు కూడా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన కూరగాయాలు, మాంసం దొరుకుతుంది. సమీకృత మార్కెట్లో స్వచ్ఛత పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్వహించడం వల్ల ఇప్పుడు ఇక్కడి వ్యాపారులకు, సమీకృత మార్కెట్కు ఎఫ్ఎస్ఎస్ఎఐ ధ్రువీకరణ లభించింది. దేశంలో మొట్టమొదటి ఎఫ్ఎస్ఎస్ఎఐ ధ్రువీకరణ పొందిన మార్కెట్గా గజ్వేల్ మార్కెట్కు గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు.
– మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్, గజ్వేల్
స్వచ్ఛత, పరిశుభ్రత, నాణ్యత నిర్వహణతోనే గుర్తింపు
కూరగాయలు, మాంసం, పండ్లు, పూల అమ్మకాలతో పాటు మార్కెట్లో స్వచ్ఛత, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్లనే గుర్తింపు లభించింది. ముఖ్యంగా అధునాతన మార్కెట్ ఏర్పాటు చేశాం. వ్యాపారులు, ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంది. అందుకే ఎంతోమంది సందర్శకులు, దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి సూసి వెళ్తున్నారు. వ్యాపారులు, ప్రజలకు సేవలందించడం గర్వంగా ఉంది.
– జాన్ వెస్లీ, ఏఎంసీ కార్యదర్శి, గజ్వేల్