న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సిద్ధ సరస్వతీ దేవి పంచవటీ క్షేత్రం వద్ద నిర్వహిస్తున్న గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా వైభవంగా జరుగుతున్నది. మంగళవారం రెండో రోజూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివలింగం, గంగామాత ఆలయంలో పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, సాధువులు, సంతులు పంచవటీ క్షేత్రంలోని సరస్వతీ దేవి, షిర్డీ సాయిబాబా, వేంకటేశ్వర స్వామి, సూర్యభగవాన్, గంగామాత ఆలయాల్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుంకుమార్చన, అభిషేకం, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
– న్యాల్కల్, ఏప్రిల్ 25
న్యాల్కల్, ఏప్రిల్ 25: రాఘవాపూర్-హుమ్నాపూర్ గ్రామ శివారులోని సిద్ధసరస్వతీ దేవి పంచవటీ క్షేత్రంలోని గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా భక్తులతో సందడిగా మారింది. రెండవ రోజైన మంగళవారం తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చారు. ఈ సందర్భంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, శివలింగంతో పాటు గంగామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. స్థానిక పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో ఉత్తర భారత దేశానికి చెందిన సాధువులు, సంతులతో పాటు పలు ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, స్వామీజీలు బాజాబజంత్రీలతో నృత్యాలు చేస్తూ మంజీరా నదిలో ప్రత్యేక స్నానాలు చేసి గంగాహారతి చేశారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, పంచవటీ క్షేత్రంలోని సరస్వతీ దేవి, షిర్డీ సాయిబాబా, వేంకటేశ్వర స్వామి, సూర్యభగవాన్, గంగామాత ఆలయాల్లో వేదంపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య కుంకుమార్చన, అభిషేకం, హోమాల పూర్ణాహుతి తదితర పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కర్ణాటకలోని బాల్కి హీరేమఠ్ పీఠాధిపతి డా. బసవలింగ పట్టదేవరు, రుస్తుంపేట పీఠాధిపతి వెంకట స్వామి, బీదర్కు చెందిన దత్తుమహారాజ్ తదితరులు భక్తులకు ప్రవచనాలను చదివి వినిపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల కుంభమేళాకు వచ్చేందుకు జహీరాబాద్, నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోల నుంచి స్పెషల్ బస్సులను నడిపారు. మంజీరానదిలో భక్తులు స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా గజఈతగాళ్లు, పోలీసులు, వలంటీర్లను సిద్ధంగా ఉంచారు. అలాగే, కుంభమేళా సభా వేదిక ప్రాంతంలో భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, పురుషులు, మహిళల కోసం మరుగుదొడ్లు, స్నానాల అనంతరం దుస్తువులు మార్చుకునేందుకు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖాధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేడుకల్లో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.