Manjeera Pushkaralu | న్యాల్కల్, మే 5: గరుడ గంగ పూర్ణ మంజీరా నదీ తీరం ఆధ్యాత్మికతతో విల్లివిరిసింది. న్యాల్కల్ మండలం రాఘవాపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలో ఉన్న ఈ నదిలో కుంభమేళా సందర్భంగా 14 రోజులుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. చివరి రోజు శుక్రవారం ఆయా ఆలయాలు, నదీ తీరంలో ఉన్న భక్తులతో జన సంద్రాన్ని తలపిచింది. స్థానిక క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో పూజారులు ఉదయం నుంచే పంచవటీ క్షేత్రంలోని సరస్వతీ దేవి, షిర్డీసాయిబాబా, వేంకటేశ్వస్వామి, సూర్యభగవన్, గంగామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పంచవటీ క్షేత్ర ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో చండీ, రుద్రహోమాలు, పూర్ణాహుతి, హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు.
నాగసాధువులు, దిగంబర సాధువులు, స్వామీజీలు పంచవటీ క్షేత్రం నుంచి మేళతాళాలు, భజభజంత్రీల హోరు, భజన కీర్తనలు, కోలాటం మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా మంజీరా నదికి తరలివెళ్లి అమృత స్నానాలను ఆచరించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య వాయినం, దీపాలు వెలిగించి పవిత్రమైన నదికి మహా గంగ హారతినివ్వడంతో కుంభమేళా ముగిసినట్లు పంచవటీ క్షేత్ర ప్రధాన అర్చకులు, వైదిక పురోహితులు అయ్యప్పస్వామి వివరించారు. తదనంతరం గంగమాత ఆలయ సమీపంలోని ధ్వజాస్తంభం వద్ద, ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.
ఆకట్టుకున్న భజన, సంస్కృతిక కార్యక్రమాలు
కర్ణాటకలోని బీదర్కు చెందిన రాజశేఖర్ దంపతులతో పాటు కుమారులు బసవ ప్రసాద్, ప్రహల్లాద్తో పాటు సంగారెడ్డి జిల్లా పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో కళాకారుల బృందం, మహారాష్ట్రకు చెందిన బీడ్ జిల్లా అక్కమహాదేవి భజన మండలి సభ్యులు, మహారాష్ట్రకు చెందిన భజన భక్తి మండలికి భజన కీర్తనలు, చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆఖరి రోజు మంజీరా కుంభమేళాకు తరలివచ్చిన వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. మండల తహసీల్దార్ ఆంటోనీ, జహీరాబాద్, సంగారెడ్డి డీఎల్పీవోలు రాఘవరావు, సతీశ్రెడ్డి, మండల ఎంపీడీవో వెంకట్రెడ్డి తదితరులు ఏర్పాట్లు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. భక్తుల సౌకర్యర్థం జహీరాబాద్, నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక చెందిన బస్సులను నడిపారు. నదీ తీరంలో ముందుజాగ్రత్త చర్యగా గజ ఈతగాళ్లు, పోలీసులు, వలంటీర్లు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్, హద్నూర్ ఎస్ఐ వినయ్కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాశీ జగద్గురు ప్రత్యేక పూజలు
గురుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళా ముగింపు వేడుకలకు కాశీ పీఠాధిపతి 1008 చంద్రశేఖర శివాచార్య, జ్ఞాన సింహాసనాధీశులు జగద్గురువులు, ముక్కల్కోట్ పీఠాధిపతి మృగరజేంద, రాఘవాచారి ఆశ్రమ పీఠాధిపతి పండరి మహారాజ్, బిచ్కుంద సంస్థాన్ పీఠాధిపతి సోమలింగ శివాచార్య మహాస్వామిజీ, ఝరాసంగం మండలం బర్ధిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరిమహారాజ్, న్యామతాబాద్ ఆశ్రమ పీఠాధిపతి విశ్వనాథ్మహారాజ్, బీదర్కు చెందిన మల్లయ్యస్వామి, గణపతి మహారాజ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు అయ్యప్ప, వైదిక పురోహితలు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పంచవటీ క్షేత్రంలోని ఆయా ఆలయాల్లో దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో మంజీరా నదికి కుంభమేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. నదిలో పవిత్ర స్నానం ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందన్నారు. మంజీరా కుంభమేళాను విజయవంత చేసిన జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులందరికీ సిద్ధి సరస్వతీ దేవి పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా కృతజ్ఞతలు తెలిపారు.