గజ్వేల్, డిసెంబర్ 5: తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధికి గజ్వేల్ పట్టణం మోడల్గా నిలుస్తుందని,సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్, అర్బన్పార్కు, మహతి ఆడిటోరియం, ఎడ్యుకేషన్హబ్లు, ఐవోసీ భవనం తదితర అభివృద్ధి పనులను ఆమె నిజామాబాద్ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. మొదటగా సమీకృత మార్కెట్ను సందర్శించిన నిజామాబాద్ అధికారుల బృందానికి ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పుష్పగుచ్ఛాన్ని అందజేసి స్వాగతం పలికారు. మార్కెట్లో వెజ్,నాన్వెజ్, పండ్లు,పూల స్టాళ్లు, విక్రయాలను అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రాకు చూపించగా, విక్రదారులతో ఆమె మాట్లాడి వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు.
వ్యాపారులకు ఇటీవలే ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహించిన శిక్షణ గురించి ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ గజ్వేల్లో సమీకృత మార్కెట్ను నిర్మించారని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా అన్నారు. అనంతరం వారు గజ్వేల్ బాలుర, బాలికల ఎడ్యుకేషన్హబ్లు, మహతి ఆడిటోరియం, ఐవోసీ భవన సముదాయం, అర్బన్ పార్కును సందర్శించగా వారికి గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆయా నిర్మాణాల గురించి వివరించారు. గజ్వేల్ అర్బన్పార్కు ఏర్పాటు, వసతుల నిర్వహణ, పార్కు నిర్వహణ, ఆదా యం తదితర వివరాల గురించి అడిషనల్ కలెక్టర్ అడుగగా బీట్ఆఫీసర్ అర్జున్ అధికారుల బృందానికి వివరించారు. మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాశశిని కళాశాలలో వసతులు, విద్యార్థుల సంఖ్య, గతంలో కళాశాల పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కమిషనర్ విద్యాధర్, కౌన్సిలర్లు గోపాల్రెడ్డి, బబ్బూరి రజిత, లక్ష్మీకిషన్రెడ్డి, బాలమణీశ్రీనివాస్రెడ్డి, శీర్లశ్యామలా మల్లేశం, ఏంఎంసీ కార్యదర్శి జాన్వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్ పాల్గొన్నారు.