వ్యవసాయరంగాన్ని పటిష్టం చేసేందుకు తెలంగాణ సర్కారు ఊరూరా రైతు వేదికలు నిర్మించింది. ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షలు ఖర్చు చేసి, మెదక్లో 76, సంగారెడ్డి జిల్లాలో 116 రైతు వేదికలను అత్యాధునికంగా నిర్మించింది. రైతులు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అవసరమైన వసతులు కల్పించడం, వాటి ఆలనాపాలనా చూసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కో రైతు వేదికకు రూ.9 వేల చొప్పున ఐదు నెలలకు సంబంధించి మెదక్ జిల్లాకు రూ.27.36 లక్షలు, సంగారెడ్డి జిల్లాకు రూ. 52.20లక్షల నిధులను మంజూరు చేసింది. కాగా, ప్రతి నెలా విడుదల చేసే నిర్వహణ ఖర్చులో ఏ పనికి ఎంత, ఎలా వినియోగించాలనే అంశాలను సైతం ప్రభుత్వం సూచించింది. రైతు వేదికల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. ఈ నిధులు ఏడీఏల పర్యవేక్షణలో ఉండనుండగా.. ఏవోలు, ఏఈవోల సూచనల మేరకు ఖర్చు చేయనున్నారు. త్వరలో క్లస్టర్ల వారీగా నిధులను కేటాయించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
సంగారెడ్డి /మెదక్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టింది. రైతులందరూ ఒకే చోట కూర్చొని సమావేశాలు నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రైతు వేదికలనూ నిర్మించింది. గతంలో రైతులు ఎక్కడో ఒక చోట కూర్చోని వ్యవసాయానికి సంబంధించిన అంశాలను చర్చించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించారు. వారి సేవలను అందుబాటులోకి తేవడానికి రూ.22 లక్షల వ్యయంతో క్లస్టర్కు ఒక రైతు వేదిక నిర్మించారు
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5 వేల ఎకరాలకు ఒక వేదిక చొప్పున జిల్లా వ్యాప్తంగా 76 క్లస్టర్లు ఏర్పాటు చేసి వీటిని ఏర్పాటు చేశారు. రైతు వేదిక భవనాలు నిర్మించి అందులోనే రైతులకు వ్యవసాయంపై ఏఈవోలు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ సీజన్లో ఏఏ రకాల పంటలు వేయాలి.. ఎంత వరకు ఎరువులు, విత్తనాలు ఉపయోగించాలి. ఏఏ భూములు ఎలాంటి పంటలు పండుతాయి.. ఆరుతడి పంటలు ఎలా వేసుకోవాలని అనే అంశాలను రైతులకు వివరిస్తున్నారు. రైతు వేదికలు నిర్మించినా, నిర్వహణకు నిధులు లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్వహణకు నిధులు మంజూరు చేసింది. గతంలో నెలకు రూ. 2వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు తాజాగా నెలకు రూ.9వేల చొప్పున 5 నెలలకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మెదక్ జిల్లాకు మొత్తం 27.36 లక్షలు విడుదలయ్యాయి. రైతు వేదికల పేరు మీద బ్యాంకుల్లో పొదుపు ఖాతాలను ప్రారంభించి సంబంధిత సమాచారం అధికారులకు అందిస్తే ఆయా ఖాతాల్లో జమ చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికల నిర్వహణకు రూ.11.90 కోట్ల నిధులు విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 116 క్లస్టర్లలో 116 రైతు వేదికల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.52.20 లక్షల నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ 2022 నుంచి ఆగస్టు 2022కు వరకు ఐదు మాసాలకు సంబంధించిన నిర్వహణ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లాలో 25 మండలాల్లో 116 రైతు వేదికలు ఉన్నాయి. అందోలు మండలంలో నాలుగు, గుమ్మడిదల రెండు, హత్నూరలో మూడు, ఝరాసంగంలో ఎనిమిది, జిన్నారంలో రెండు, కల్హేర్లో నాలుగు, కందిలో రెండు, కంగ్టిలో ఏడు రైతు వేదికలు నిర్మించారు. కోహీర్ మండలంలో ఆరు, కొండాపూర్లో ఐదు, మనూరులో ఐదు, మొగుడంపల్లిలో నాలుగు, మునిపల్లిలో ఐదు, నాగల్ గిద్దలో ఐదు రైతు వేదికలు ఉన్నాయి. వీటితో పాటు నారాయణఖేడ్ మండలంలో ఏడు, న్యాల్కల్లో ఎనిమిది, పటాన్చెరులో మూడు, పుల్కల్లో ఐదు, రాయికోడ్లో ఏడు రైతు వేదికలు నిర్మించారు. రామచంద్రాపురం మండలం లో ఒకటి, సదాశివపేటలో ఏడు, సంగారెడ్డిలో రెండు, సిర్గాపూర్లో నాలుగు, వట్పల్లిలో నాలుగు, జహీరాబాద్లో ఆరు రైతు వేదికలు ఉన్నాయి. రైతు వేదికల్లో క్రమం తప్పకుండా ప్రతి సీజన్లో వ్యవసాయశాఖ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ నిధులతో విద్యుత్ బిల్లులు రూ. వెయ్యి, వాటర్ బిల్లులు రూ.500, రైతు వేదిక హౌజ్ కీపింగ్, సిబ్బంది వేతనాలకు రూ.3 వేలు, స్టేషనరీ రూ. వెయ్యి, శిక్షణ తరగతుల నిర్వహణ ఖర్చు రూ. 2500, ఇతర ఖర్చులకు రూ. వెయ్యి చెల్లించడం జరుగుతుంది. నిధులు ఖర్చు చేసిన వివరాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారులు జిల్లా వ్యవసాయశాఖ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికల నిర్వహణకు నిధులు విడుదల చేయడంపై రైతు సంఘాలు, రైతు బంధు సమితి అధ్యక్షులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 76 క్లస్టర్లకు రూ.45 వేల చొప్పున రూ.27.36 లక్షలు నిధు లు మంజూరయ్యాయి. వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా నిధుల నిర్వహణకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తీసుకోవాలని చెప్పాం. అన్ని రైతు వేదికల వివరాలు సేకరించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిధులు అందిస్తాం. రైతు వేదికల్లో మెరుగైన సేవలు అందిస్తాం.
-ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మెదక్