రామాయంపేట, డిసెంబర్ 1: నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిండు ఆరోగ్యానికి రోజుకొక పండు తినాలనుకునే వారికి పండ్ల ధరలు చుక్క లు చూపిస్తున్నాయి. రేటు ఎంత పెరిగినా ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు కొనక తప్పడం లేదు. రామాయంపేట పట్టణం జాతీయ రహదారి పక్క నే ఉండడంతో పండ్ల వ్యాపారం ఎక్కువగా జరుగుతున్నది. బస్సుల్లో వచ్చే ప్రయాణికులు బస్టాం డు ఎదురుగా ఉండే దుకాణాల్లో పండ్లు కొనుగోలు చేస్తుంటారు. పండ్ల దిగుమతికి ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎక్కువగా అవుతుండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
పండ్ల ధరలు విపరీతంగా పెరగడంతో విక్రయాలు లేవని పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో పట్టణానికి చేరుకోవడంతోనే పండ్ల బండ్లతో పాటు మొక్కజొన్న, దోసకాయలు, జామ, అరటి, యాపిల్స్ రకరకాల పండ్లు ఉన్నప్పటికీ వాటి రేట్లను చూసి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే డజను అరటి పండ్లు రూ.50 పలుకుతున్నాయి. ఒక్క చిన్నసైజ్ యాపిల్ రూ.30 కాగా, ద్రాక్ష కిలోకి రూ.100 ఉంది. సపోట, ఆరెంజ్, బొప్పాయి, ఖర్భూజ రేట్లు కూడా పెరగడంతో పండ్లను కొనలేక ప్రజలు, వ్యాపారం సరిగా జరగక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపై పండ్ల బండ్ల వద్ద పొద్దంత కూసున్నా కూలి పడుతలేదు. పండ్లకు రేట్లు పెరగడంతో అంతంతమాత్రంగానే అమ్ముడవుతున్నాయి. బస్సులు, ఆటోలు దిగగానే పండ్లు కొనేందుకు వచ్చిన వారు రేటు అడిగి తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో గిరాకీ తగ్గిపోతున్నది. వ్యాపారం సరిగా సాగకపోవడంతో మధ్యాహ్నం పూట పండ్ల దుకాణాలను బంధు చేస్తున్నాం. అమ్ముడుపోక పండ్లు ఖరాబవుతున్నాయి.
స్థానికంగా పండ్లు లభించక ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నాం. పెరిగిన రేట్లతో సరిగా అమ్ముడుపోక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీద పడ్తున్నాయి. పొద్దంత కూర్చొని అమ్మితే రోజు కూలి కూడా పడడం లేదు. స్థానికంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పండ్ల తోటలు ఉంటే ధరలు ఇంత ఉండేవి కావు.
కూరగాయలే అంటే పండ్ల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ చుక్కలనంటుతున్నాయి. పిల్లల కోసం పండ్లు కొందామని పోతే అనుకున్నదానికన్నా సగమే కొని ఇంటికొస్తున్నాం. రేటు బాగా చెప్తున్నరంటే ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెరుగుతున్నయని వ్యాపారులు అంటున్నరు. పండ్లు కొనాలంటేనే భయమే స్తున్నది. అయినా ఆరోగ్యం కోసం కొనక తప్పడంలేదు.