మెదక్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): మెదక్ పార్లమెంట్ స్థానానికి రెండోరోజు శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ పార్లమెంట్ స్థానానికి మెదక్ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. శుక్రవారం ప్రజా వెలుగు పార్టీ నుంచి సారా యాదగిరిగౌడ్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బొమ్మల విజయ్ కుమార్, తుమ్మలపల్లి పృథ్వీరాజ్ నామినేషన్లు వేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గొల్లపల్లి సాయిగౌడ్ నామినేషన్ వేశారని రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మెదక్ కలెక్టరేట్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నామినేషన్ పత్రాల దాఖలులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా నామినేషన్ల దాఖలు జరిగేలా నిఘా ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి.బాలస్వామి పర్యవేక్షణలో నిత్యం నామినేషన్ల స్వీకరణలో డీఎస్పీ డాక్టర్ రాజేశ్తో పాటు సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.