రామచంద్రాపురం, సెప్టెంబర్10: గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్కాలనీలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయంలోని ఖాళీ స్థలంలో రూ.కోటితో నిర్మించనున్న యాదవ కమ్యునిటీ భవనానికి డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ కులస్తులకు ఇచ్చిన మాట ప్రకారం యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు.
భవన నిర్మాణ పనులు వేగంగా నిర్వహించి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని కులాల వారికి సమ ప్రాధాన్యతనిస్తూ, సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గొల్లకురుమల అభ్యున్నతికి పాడి పరిశ్రమను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదన్నారు. అనంతరం యాదవులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, డివిజన్ అధ్యక్షుడు గోవింద్, ఆదర్శ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రాగం రమేశ్యాదవ్, సాయిలు, జైపాల్, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.