“ఓల్డ్ ఈజ్ గోల్డ్..మళ్లీ రాబోయేది మట్టి రోజులే.. ట్రెండ్ మారుతున్నది..ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్నది” అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేసీఆర్నగర్లో మంగళవారం బీసీ కార్పొరేషన్ సౌజన్యంతో పాటరీ ఇండస్ట్రీతోపాటు కుమ్మరి కులవృత్తుల శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రలకు ఆదరణ పెరుగుతున్నదన్నారు. వేగంగా చేసే మట్టి పాత్రల తయారీ ఇండస్ట్రీ ద్వారా ఆదాయం అధికమవుతుందన్నారు. 400 మంది కుమ్మరులకు లక్ష సాయం అందించామన్నారు. కులవృత్తి మీద ఆధారపడి పనిచేసే వారికి సొంతంగా మిషన్లు అందించేందకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
– సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 26
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 26 : “ఓల్డ్ ఈజ్ గోల్డ్.. మళ్లీ రాబోయేది మట్టి రోజులే.. ట్రెండ్ మారుతున్నది.. ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్నదని.. మట్టి పాత్రలకు అధిక ప్రాధాన్యం పెరుగుతున్నది” అని ఆర్థిక, వైద్యా రోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేసీఆర్నగర్లో మంగళవారం బీసీ కార్పొరేషన్ సౌజన్యంతో కుమ్మర మోడ్రసన్ మెకనైజ్డ్ పాటరీ ఇండస్ట్రీతో పాటు కుమ్మరి కుల వృత్తుల శిక్షణ కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రలకు ఆదరణ పెరుగుతున్నదన్నారు. ఒకప్పటి కుండలు, పాతబడ్డ కుండలకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయన్నారు. కుండ బిర్యానీ స్పెషల్ అయి.. డిమాండ్ పెరుగుతున్నదన్నారు. ఛాయ్ కప్పులను కూడా మట్టివే వాడుతున్నారన్నారు. రూ.5 కోట్ల విలువైన భూమి, రూ.2.5 కోట్లతో ఈ పరిశ్రమ స్థాపించుకున్నామని.. టెక్నాలజీతో మట్టిపాత్రలు రూపొందించడమే ఈ పరిశ్రమ ధ్యేయమన్నారు. అందంగా.. వేగం గా చేసే మట్టి పాత్రల తయారీ ఇండస్ట్రీ ద్వారా ఆదాయం పెరుగుతుందన్నారు.
ఈ కేంద్రంలో ఎవరైనా శిక్షణ పొందవచ్చని.. ప్రభుత్వ సహాయంతో ఇంట్లో తయారు చేసుకొని ఆర్థిక అభివృద్ధి పొందే అవకాశం ఉందన్నారు. 400 మంది కుమ్మరులకు లక్ష సహాయం అందించామని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వృత్తి మీద ఆధారపడి పనిచేసే వారికి తామే సొంతంగా మిషన్ అందించేందకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మీ కోరిక మేరకు తప్పకుండా ఫంక్షన్ హాల్ మంజూరు చేయిస్తామని.. శాలివాహన చక్రవర్తి విగ్రహం తప్పకుండా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. నాటి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆలోచన.. జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ సరోజ ఆచరణతో ఏడాదిన్నర శ్రమతో ఇది సాధ్యమైందని.. వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.